జైపూర్ : మాస్క్ ధరించిన దుండగులు కేవలం 12 నిమిషాల్లో ఏకంగా ఏటీఎంను దోచుకెళ్లిన ఘటన రాజస్ధాన్లోని బర్మార్లో కలకలం రేపింది. బొలెరో వాహనంలో మంగళవారం రాత్రి మాస్క్ ధరించి వచ్చిన ఐదుగురు దుండగులు రూ 38 లక్షల నగదున్న ఏటీఎంను చోరీ చేసి అదే వాహనంలోకి ఎక్కించి పరారయ్యారు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాస్క్లు ధరించిన ఐదుగురు వ్యక్తులు బొలెరో వాహనంలో వచ్చి ఏటీఎం షట్టర్ను బద్దలుకొట్టారు. సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు చైన్ను ఉపయోగించి ఏటీఎంను తొలగించి తమ వాహనంలో ఎక్కించుకుని పరారయ్యారు. కేవలం 12 నిమిషాల్లోనే చోరీ తతంగాన్ని వారు ముగించారు. ఇక బుధవారం ఉదయం చోరీ జరిగిందని ముందుగా సెక్యూరిటీ గార్డు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనా స్ధలానికి చేరుకున్న నగనా పోలీసులు దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. ప్రాధమిక దర్యాప్తులో ఐదుగురు వ్యక్తులు ఏటీఎం చోరీ ఘటనలో పాల్గొన్నారని గుర్తించారు. నేరానికి పాల్పడే ముందు నిందితులు ఘటనా స్ధలంలో రెక్కీ నిర్వహించారని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.