సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): మీ పేరుతో వచ్చిన ఫెడెక్స్ కొరియర్లో డ్రగ్స్, గడువు తీరిన ఏడు పాస్పోర్టులు ఉన్నాయంటూ ముంబై సైబర్క్రైమ్ ఆఫీసర్స్ పేరుతో బెదిరించిన సైబర్నేరగాళ్లు ఓ మాజీ ఉద్యోగి నుంచి ఆన్లైన్ ద్వారా రూ.50 లక్షలు దోచేశారు. పోలీసుల కథ నం ప్రకారం.. నగరానికి చెందిన బాధితుడికి ఓ కాల్ వచ్చింది. ముంబై సైబర్క్రైమ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పారు. మీరు వెంటనే వీడియో కాల్లోకి రావాలంటూ చెప్పి, స్కైప్లో వీడియో కాల్ చేశారు. మీ పేరుతో వచ్చిన పార్శిల్కు మీ ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లు లింక్ అయి ఉన్నాయి, అందులో డ్రగ్స్ ఉన్నాయంటూ బెదిరించారు.
మా విచారణకు మీరు సహకరించకపోతే వెంటనే హైదరాబాద్లో ఉండే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంటూ ఒత్తిడి చేశారు. మీ పేరుతో 20 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, అన్నింటికి ఈ ఆధారే ఉపయోగించాలంటూ స్కైప్లో మాట్లాడారు. మీ వద్ద ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు చెప్పండంటూ బాధితుడి వద్ద నుంచి హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ బ్యాంకు ఖాతాల వివరాలను తీసుకున్నారు. ఆ బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 49,35,134 నగదును నేరగాళ్లు తమ ఖాతాల్లో బదిలీ చేసుకున్నారు. కేసు విచారణ జరుగుతున్నదని, డబ్బు తిరిగి మీకే ఇచ్చేస్తామంటూ నమ్మించి, ఆ డబ్బులన్ని కాజేశారు. ఆ షాక్ నుంచి తేరుకున్న బాధితుడు సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.