India-Nepal : ఇండియా-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు ఆలస్యంగా వెల్లడైంది. సరిహద్దులో భద్రతా విధులు నిర్వహిస్తున్న ఎస్ఎస్బీ (సశస్త్ర సీమా బల్)కు చెందిన సిబ్బందిపై నేపాల్కు చెందిన కొందరు గ్రామీణులు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటన ఆగష్టు 2న జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి. ఇండియా-నేపాల్ సరిహద్దు అయిన బిహార్లోని వెస్ట్ చంపారన్ వద్ద ఎస్ఎస్బీ సిబ్బంది, ఉన్నతాధికారులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. జూలై 31న సరిహద్దులో నేపాల్ వైపు ఉన్న సుస్తా గ్రామస్తులు మట్టితో ఒక నిర్మాణం చేపట్టారు.
అయితే, అది నేపాల్ వైపు నుంచి ఇండియాలోకి వచ్చింది. అంటే, ఇండియా భూభాగంలో ఆ నిర్మాణం చేపట్టారు. దీనిపై ఎస్ఎస్బీ దళాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఈ అంశంపై ఇటు భారత సిబ్బంది, అటు నేపాల్ ఆర్ముడ్ ఫోర్స్ కలిసి చర్చించి, ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ నిర్మాణాన్ని ఆపేయాలని నిర్ణయించారు. అయితే, అక్కడ ఏ నిర్మాణం చేపట్టకూడదనే ఒప్పందం ఉన్నప్పటికీ, మళ్లీ కొందరు నేపాల్ గ్రామస్తులు ఆగష్టు 2న తిరిగి నిర్మాణం ప్రారంభించారు. దీన్ని ఎస్ఎస్బీకి చెందిన భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో నేపాల్కు చెందిన గ్రామస్తులు భారత సిబ్బందిపైకి రాళ్లు రువ్వారు. దాదాపు 150 నుంచి 200 మంది గ్రామస్తులు కలిసి భారత సిబ్బందిపైకి రాళ్లు, కర్రలతో దాడికి యత్నించారు.
ఈ నేపథ్యంలో నేపాల్ గ్రామస్తులపై ఎస్ఎస్బీ, రాంపూర్వ, 21వ బెటాలియన్ కమాండర్కు చెందిన ఉన్నతాధికారి అవ్దేష్ కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమపై నేపాల్ గ్రామస్తులు దాడికి దిగారని ఆరోపిస్తూ వాల్మీకి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.