మిషన్ భగీరథ అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా హసన్పర్తిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ శిబిరాలలో రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అనంతరం మిషన్ భగీరథ కార్యాలయంలో ల్యాబ్ను పరిశీలించారు
అంతకుముందు మిషన్ భగీరథ కార్యాలయ ఆవరణలోని మోక్ష గుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా మిషన్ భగీరథ శాఖ ఉద్యోగులంతా కలిసి రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ విషయమని కొనియాడారు. ‘‘రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటింటికి మంచినీటి నల్లాల ద్వారా ఆరోగ్యకరమైన నీటిని సరఫరా చేస్తున్న ఉద్యోగులు, రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడాలని నిర్ణయించుకోవడం ఆదర్శనీయం.
ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణతో పాటు సేవా కార్యక్రమాల వైపు రావడం శుభ సూచకం. ఇలాంటి కార్యక్రమాలు మిగతా శాఖలకు కూడా ఆదర్శవంతం కావాలని కోరుకుంటున్నాను. ఆయా శాఖలు మిషన్ భగీరథ శాఖ సిబ్బందిని అనుసరించాలని ఆకాంక్షిస్తున్నాను. మిషన్ భగీరథ సిబ్బందిని అభినందిస్తున్నాను.
భారత స్వాతంత్ర్య సమర స్ఫూర్తిని ప్రజలకు అందజేయాలని, తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తిని కూడా ప్రజలకు చాటాలని కోరుతున్నాను. ప్రజలకు, ఉద్యోగులకు అన్ని రంగాల వారికి సేవా తత్పరత అలవర్చుకోవాలని సూచిస్తున్నాను’’ అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఎన్సి కృపాకర్ రెడ్డి, సిఇ, ఎస్ఇలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.