హనుమకొండ, మే 9 : మాయమాటలు, అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ఓ ఝూటా సీఎం అని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లా మైనార్టీ నాయకుడు నయీముద్దీన్ అధ్యక్షతన ముస్లింలు, సిక్కులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మహమూద్ అలీ హాజరుకాగా వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపెల్లి సుధీర్కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్అలీ మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్సే అని అన్నారు.
నిరుపేద ముస్లింల వివాహాలకు షాదీముబారక్ పథకం ద్వారా ఆర్థిక సాయం, రంజాన్ సందర్భంగా నూతన వస్ర్తాలు, ఇమామ్లకు వేతనాలు అందజేసిన మహనీయుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అని తెలిపారు. ముస్లింల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ముస్లింలను పట్టించుకోలేదన్నారు. అమలు, ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందన్నారు. రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కారు ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. బడే భాయ్ మోడీ, చోటే భాయ్ రేవంత్రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని అన్నారు. బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపెల్లి సుధీర్కుమార్ నిఖార్సైన ఉద్యమకారుడని, నీతిమంతుడైన ఆయనను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలని ముస్లిం లను మహమూద్ అలీ కోరారు.
మతతత్వ బీజేపీ, మోసం చేసిన కాంగ్రెస్ పార్టీలను భూ స్థాపితం చేయాలని దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మైనార్టీలు భాగస్వాములయ్యారన్నారు. 70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్, బీజేపీలు మసీదులు, ఇమామ్లు, మైనార్టీల గురించి మాట్లాడలేదని, తెలంగాణ ఏర్పాటు అనంతరం వారి గురించి మాట్లాడింది ఒక్క కేసీఆరేనని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్పై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని, ఆ పార్టీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. విద్యకు దూరమైన మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. బీఆర్ఎస్ పాలనలో మైనార్టీలకు ఉసూల్ఖానా, కుట్టు శిక్షణ కేంద్రం లాంటివి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బడాభాయ్.. చోటాభాయ్లు తెలంగాణలో కుట్రలు పన్నుతూ చిచ్చురేపుతున్నారన్నారు.
ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభ్యర్థి సుధీర్కుమార్ గెలిస్తే ఆయన నిధుల నుంచి మైనార్టీ భవన్ నిర్మించే బాధ్యత తనదేనని దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. పార్టీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ మాట్లాడుతూ ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకూ పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్, బీజేపీలకు భయం పుట్టుందని అన్నారు. దీంతోనే మోదీ, రేవంత్రెడ్డి వరంగల్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని అన్నారు. ఆ పార్టీలకు బుద్ధ్ది చెప్పాలన్నారు. అలాగే, పార్టీలు మారే వ్యక్తులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేవంత్రెడ్డి కేబినెట్లో ముస్లింలకు చోటు ఉండదన్నారు. తనను వరంగల్ ఎంపీగా గెలిపిస్తే దేశానికి ఒక దిక్సూచిగా పని చేస్తానని అన్నారు. సమావేశంలో మాజీ చైర్మన్ మౌలానా యూసుఫ్ జాయిద్, జీడబ్ల్యూఎంసీ డిప్యూటీ మేయర్ మసూద్, మాజీ మేయర్ సిరాజుద్దీన్, షఫీ, ఎలిషా, తస్లీమా, పర్విన్, సోని, మైనార్టీ, సిక్కు నాయకులు పాల్గొన్నారు.