కారేపల్లి, జూలై 24 : ఉసిరికాయలపల్లి కోట మైసమ్మ జాతరలో ఏర్పాటు చేయనున్న దుకాణాల నిర్వహణకు బహిరంగ వేలం పాటను శుక్రవారం దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సమత ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతర సమయంలో 11 రోజుల పాటు దుకాణాల ఏర్పాటు లైసెన్స్ హక్కులు పొందేందుకు వేలం పాట నిర్వహించారు. కొబ్బరికాయలు, పూజ సామాగ్రి, లడ్డు, పులిహోర, పుట్నాలు, పేలాలు, మిఠాయి, ఐస్ క్రీమ్ అమ్ముకొనుటకు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి పలువురు వ్యాపారులు తరలివచ్చి వేలం పాటలో పాల్గొని లైసెన్స్ హక్కులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి కె.వెంకటయ్య, స్థానిక సర్పంచ్ వరలక్ష్మి, దేవాలయ ప్రధాన అర్చకుడు కొత్తలంక కైలాస శర్మ, ఉద్యోగులు పరస సాయి, గణితి నారాయణ, మూడ్ మోహన్ చౌహన్ పాల్గొన్నారు.