కరీంనగర్ : ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వాన్ని ఆదరించి, ఆశీర్వదించాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇప్పల నర్సింగాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ప్రతి వీధిలో తిరుగుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు మంత్రి వద్ద తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వర్షం పడితే చిలుకవాగు పొంగి ఇప్పల నర్సింగాపూర్ నుంచి బయటకు వెళ్లలేకపోతున్నామని, ఇటీవల వర్షాలకు ఐదురోజులు ఇండ్లలోనే ఉన్నామన్నారు. గొడ్డు గోద అన్నీ వ్యవసాయబావుల వద్దనే ఉన్నాయని సులోచన అనే మహిళ మంత్రి గంగులకు వివరించారు. వాగుపై తక్షణమే వంతెన నిర్మణం చేపట్టాలని స్థానికులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. పెద్దమ్మ గుడి, బీరప్ప గుడి, ఇతర అభివృద్ధి పనులను దృష్టి తీసుకువచ్చారు.
అనంతరం మంత్రి కమలాకర్ మాట్లాడుతూ గ్రామ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇంతకాలం మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ను ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ఇక్కడ ఇన్ని సమస్యలుంటే ఆయన ఎందుకు పట్టించుకోలేదని? అన్నారు. జిల్లా మంత్రిగా మీ సమస్యలు తీర్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. బీజేపీకి ఓటు వేయొద్దని, కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతుందని ఆరోపించారు. మహిళలు తిరిగి కట్టెల పొయ్యిమీద వంట చేసుకోవాలని దుస్థితి కల్పిస్తుందని విమర్శించారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించి, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.