టోక్యో : పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా ఫైనల్స్కు అర్హత సాధించాడు. 86.65 మీటర్లు విసిరి నేరుగా ఫైనల్కు చేరాడు. తొలి ప్రయత్నంలోనే అతను రికార్డు స్థాయిలో 86.65 మీటర్ల దూరం పాటు జావెలిన్ను విసిరాడు. గ్రూప్-ఏ విభాగంలో అగ్రస్థానంలో నిలిచి.. నేరుగా ఫైనల్కు అర్హత సాధించాడు. జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్స్కు చేరాలంటే 83.50 మీటర్ల దూరం పాటు జావెలిన్ను విసరాల్సి ఉంటుంది.. లేదంటే తొలి 12 మందిలో నిలవాల్సి ఉంటుంది. నీరజ్ చోప్రా ఏకంగా 86 మీటర్లకు జావెలిన్ను సంధించడంతో ఆటోమేటిక్గా ఫైనల్స్కు అర్హత సాధించినట్లయింది.
అలాగే ఈ సీజన్లో అతనికి అత్యుత్తమ త్రో కావడం విశేషం. ఇదిలా ఉండగా.. ఇదే గ్రూప్లో ఫిన్లాండ్కు చెందిన లస్సీ ఎటలాట 84.50 మీటర్ల త్రోతో నేరుగా ఫైనల్స్కు అర్హత సాధించాడు. ఆ తర్వాత రొమేనియాకు చెందిన అలెగ్రాండ్రూ మిహైతో నోవాక్ 83.27 మీటర్లు విరిసి మూడుస్థానంలో నిలిచాడు. స్వీడన్కు చెందిన కిమ్ అంబ్ 82.40 మీటర్లతో నాలుగో స్థానంలో, జర్మన్ లెజెండ్ జోహన్నెస్ వెట్టర్ 82.04తో ఐదో స్థానాన్ని నిలుపుకున్నాడు. కాగా, జావెలిన్ త్రో ఫైనల్ మ్యాచ్ ఈ నెల 7న జరుగనుంది.
మరో వైపు ఇవాళ భారత క్రీడాకారులు పలు క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. గోల్ఫ్ క్రీడాకారులు అధితి అశోక్, దీక్షా దగర్, జావెలిన్ త్రోయర్ శివపాల్ సింగ్, బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, రెజ్లర్లు దీపక్ పునియా, రవి కుమార్, అన్షు మాలిక్ పోటీపడనున్నారు. ఆస్ట్రేలియాపై సంచలన విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో అర్జెంటీనాపై తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా గెలిస్తే సరికొత్త చరిత్రకు అడుగు దూరంలో ఉంది. టోక్యో ఒలింపిక్స్లో సోమవారం జరిగిన క్వార్టర్స్లో భారత మహిళల జట్టు.. ప్రపంచ నంబర్-2 ఆస్ట్రేలియాపై నెగ్గి సెమీస్ చేరింది.
విశ్వక్రీడల్లో భారత మహిళా హకీ జట్టు సెమీఫైనన్కు చేరడం ఇదే తొలిసారి. ఇవాళ జరిగే సెమీస్లో గెలిస్తే ఫైనల్కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించినట్లవుతుంది. మరో వైపు బాక్సింగ్ విభాగంలో ఇప్పటికే లవ్లీనా భారత్కు పతకం ఖరారు చేసింది. క్వార్టర్స్లో చైనీస్ తైపీ బాక్సర్పై 4-1 తేడాతో గెలిచిన ఈమె.. సెమీస్లో 69 కేజీల విభాగంలో టర్కీ బాక్సర్ సుర్మేనేలి బుసానాజ్తో తలపడనుంది. అందులో గెలిస్తే ఫైనల్కు అర్హత సాధించనుంది. ఓడినా ఆమెకు కాంస్య పతకం కైవసం చేసుకోనుంది.