ఇస్లామాబాద్: మీ ఇంట్లో పెద్దవాళ్లు మిమ్మల్ని మందలిస్తే మీరేం చేసేవాళ్లు..? నేనైతే కాసేపు మాట్లాడటం మానేసేవాన్ని. ఎక్కువ కోపం వస్తే అన్నం తినకుండా పడుకునే వాన్ని. బాధగా అనిపిస్తే కొంతసేపు బయటికి వెళ్లిపోయి మనసు కుదుటపడ్డాక తిరిగి వచ్చేవాన్ని. కానీ పాకిస్థాన్కు చెందిన 15 ఏండ్ల బాలుడు ఇంట్లో వాళ్లతో గొడవపడి ఏంచేశాడో తెలుసా..? ఏకంగా దేశ సరిహద్దులు దాటి భారత సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు భారత సరిహద్దుల్లోకి వచ్చిన బాలుడిని బీఎస్ఎఫ్ బలగాలు అడ్డుకున్నాయి.
గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని ఖవ్డా గ్రామం సమీపంలోని పిల్లర్ నెంబర్ 1099 వద్ద సదరు బాలుడు ఫెన్సింగ్ దాటి భారత్లోకి ప్రవేశించడంతో బీఎస్ఎఫ్ జవాన్లు అదుపులోకి తీసుకున్నారు. బీఎస్ఎఫ్ అధికారుల ప్రాథమిక విచారణలో తాను ఇంట్లో గొడవపడి పారిపోయిన వచ్చినట్లు బాలుడు చెప్పాడు. అనంతరం బాలుడిని బీఎస్ఎఫ్ అధికారులు ఖవ్డా పోలీసులకు అప్పగించారు.
గత నెల 22న కూడా ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. బంగ్లాదేశ్కు చెందిన ఓ 12 ఏండ్ల బాలుడు పశ్చిమబెంగాల్లో ఉన్న తన తాతను కలిసేందుకు సరిహద్దులు దాటి వచ్చాడు. దాంతో బీఎస్ఎఫ్ జవాన్లు ఆ బాలుడిని అదుపులోకి తీసుకుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో అధికారులు ప్రాథమిక విచారణ జరిపారు. బాలుడు భారత్లోకి ప్రవేశించడం వెనుక ఎలాంటి కుట్ర లేదని నిర్ధారించుకుని బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించారు.