ప్రజలకు పరిపాలన చేరువ చేసే సత్సంకల్పంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏర్పాటుచేసిన కొత్త జిల్లాలు అభివృద్ధిలో పోటీపడుతూ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న క్రమంలో ‘జిల్లాల రద్దు’ ప్రకటన అయోమయానికి గురిచేస్తున్నది. మారుమూల ప్రాంతాల్లో మౌలిక, రవాణా సదుపాయా లు మెరుగుపడడమే గాక జిల్లాకేంద్రంలో సరికొత్త హంగులతో రూపుదిద్దుకున్న కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, అధికార యంత్రాంగం అందుబాటులోకి వచ్చి సాఫీగా సాగుతున్న చిన్న జిల్లాలను ఎత్తివేస్తే ఈ ప్రాంత మనుగడ, అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని అన్ని వర్గాల్లో ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లే చేస్తే జిల్లాల్లో అభివృద్ధి కుంటుపడి, పాలన దూరమై పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని, పరిపాలన భవనాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని భూపాలపల్లి, ములుగు జిల్లాల మేధావులు, ప్రజలు ఆవేదన చెందుతుండగా, జిల్లాల జోలికొస్తే ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ నేతలు, ఉద్యమకారులు హెచ్చరిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి పాలనను ప్రజలకు చేరువ చేశారు. కలెక్టర్, ఎస్పీతో పాటు అధికార యంత్రాంగాన్ని జనానికి అందుబాటులోకి తెచ్చారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఉద్యమ సమయంలో భూపాలపల్లిని జిల్లా చేస్తానని, జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెడతానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నారు. భూపాలపల్లికి జయశంకర్ జిల్లాగా నామకరణం చేసి అభివృద్ధికి బాట వేశారు. 11 మండలాలతో కొనసాగుతున్న భూపాలపల్లి జిల్లాలో అద్భుతమైన పాలన ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మారుమూల ప్రాంతాలు సైతం అభివృద్ధి బాట పట్టాయి. దారే లేని పలిమెల మండలానికి రహదారి ఏర్పడింది. కాగా సీఎం రేవంత్రెడ్డి చేస్తున్న జిల్లా రద్దు ప్రకటన ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నది. ఇంత మంచి పాలన ఇక లేనట్టేనా అని ప్రజలు నిరాశకు గురవుతున్నారు. జిల్లా రద్దయితే ఈ ప్రాంత అభివృద్ధి ఆగిపోతుందని, కొత్తగా ఏర్పాటుచేసిన మెడికల్ కళాశాల, కలెక్టరేట్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని, రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే కుప్పకూలుతుందని, ఆచార్య జయశంకర్ పేరు కనుమరుగు కానున్నదని మేధావి వర్గం అభిప్రాయపడుతున్నది.
ములుగును కలిపి భూపాలపల్లిని జిల్లాగా మార్చడంతో రియల్ ఎస్టేట్ రంగం ఇక్కడ ఊహించని విధంగా పుంజుకుంది. ఆ తర్వాత ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసినప్పటికీ ఆ ఊపు తగ్గలేదు. సింగరేణి సంస్థ బొగ్గు వెలికితీత కార్యకలాపాలు ఒకవైపు సమీపంలోనే జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మరోవైపు, దీనికి తోడు భూపాలపల్లి జిల్లాగా మారడం రియల్ రంగానికి కలిసొచ్చింది. గడిచిన పదేళ్లలో భూపాలపల్లి ముఖచిత్రమే మారిపోయింది. అనతికాలంలోనే భూముల ధరలు ఆకాశాన్నంటాయి. భారీ భవనాలు వెలిశాయి. ములుగులో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సైతం భూపాలపల్లిలో ఏర్పాటుచేయగా భూముల రిజిస్ట్రేషన్ కోసం జనం క్యూ కడుతున్నారు. ఇదిలా ఉండగా సీఎం రేవంత్రెడ్డి 19 జిల్లాల రద్దు, లోక్సభ నియోజకవర్గాల వారీగానే కొత్త జిల్లాలు అంటూ ప్రకటనలు చేయడం, ఆ ప్రభావం రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక్కసారిగా రియల్ రంగం చతికిల పడింది. భూపాలపల్లి, పరిసర ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లు బోసిపోతున్నాయి.
ములుగు జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తే చేరువైన పాలన దూరం కానున్నది. ఈప్రాంతం తన అస్తిత్వాన్ని కోల్పో యే ప్రమాదమున్నది. ఉద్యమ సమయంలో వనదేవతల సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం అప్పటి సీఎం కేసీఆర్ ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిల్లాను ఎత్తివేస్తే నాటి పాలనా కష్టాలు తిరిగి పునరావృతం కానున్నాయి. వనదేవతలు నడియాడిన ఈ ప్రాంతానికి భంగపాటు కానున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన విధంగా మారుమూల ప్రాంతాల దూరం ఆధారంగా గ్రామపంచాయతీగా ఉన్న ములుగును 2019లో 11మండలాలతో రాష్ట్రంలో 33వ జిల్లాగా ఏర్పాటు చేశా రు. అప్పటి నుంచి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు అన్నిశాఖల అధికారులు రావడంతో పరిపాలనా సౌకర్యం మెరుగుపడింది. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలు అభివృద్ధిలో ఇప్పుడిప్పుడే ఇతర జిల్లాలతో పోటీపడుతున్నాయి. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం, ప్రత్యేక జిల్లా కోర్టు, ఎస్పీ కార్యాలయానికి స్థలం కేటాయించగా నిర్మాణ పను లు వేగంగా కొనసాగుతున్నాయి. మెడికల్ కాలేజీ నిర్మాణం కూడా ప్రారంభమైంది. జిల్లా రద్దు అయితే అభివృద్ధి పనులతో పాటు వీటన్నింటికి ఆటంకం ఏర్పడి ములుగు ప్రాంతం మరింత వెనుకబడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
భూపాలపల్లి జిల్లాను తొలగిస్తే అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారుతుంది. మెడికల్ కళాశాల, జిల్లా ఆస్పత్రి అప్గ్రేడ్, రాజుల కోట లా పోలీసు కార్యాలయం, జిల్లా కలెక్టర్ సముదాయం, ఆర్అండ్బీ అతిథిగృహం, కొత్త మండలాల ఏర్పాటు, గ్రామ పంచాయతీలుగా మారిన తండాలు, గ్రామగ్రామానికి రోడ్లు, ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటు.. ఇలా ఎన్నడూ లేని అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోంది. సీఎం ప్రకటనతో అంతలోనే కల చెదిరిపోనుందా?, పరిపాలనా కార్యాలయాన్ని మరో ప్రాంతానికి తరలిపోవాల్సిం దేనా..? ఇక్కడి ఉద్యోగులంతా మరోచోటుకి వెళ్తే.. జోనల్ వ్యవస్థ తొలగిపోతే.. కొత్త ఉద్యోగాల రిక్రూట్మెంట్ల పరిస్థితి ఏమిటి? మళ్లీ జోనల్ వ్యవస్థ ఏర్పాటయ్యేదాక నియామకాలు ఆగిపోవాల్సిందేనా?. ఇలా అనేక సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
భూపాలపల్లి జిల్లాగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊహించని విధంగా పుంజుకుంది. చుట్టుపక్కల మార్కెట్ రేట్ పెరిగింది. ఇదే ఊపుతో చాలామంది వ్యాపారులు భూములు కొని ప్లాట్లుగా మార్చారు. సీఎం రేవంత్రెడ్డి ప్రకటనతో మార్కెట్ పడిపోయింది. జిల్లాలు మారుస్తారనే ప్రచారంతో రియల్ ఎస్టేట్ చతికిల పడింది. అందరం వెంచర్లు ఏర్పాటు చేసి కొనుగోలు చేసే వారి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.
భూపాలపల్లి జిల్లాను కదిలిస్తే ఉద్యమం తప్పదు. ప్రజలకు పాలన చేరువ కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. చిన్న జిల్లాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. జిల్లా ఏర్పాటుతో చాలా అభివృద్ధి జరిగింది. సీఎం ప్రకటనతో అభివృద్ధి ఆగిపోయినట్లయింది. చిత్తశుద్ధి ఉంటే జిల్లా తరలిపోదని ప్రకటించాలి. లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రజలు ఉరికిచ్చి కొడ్తరు.