వరంగల్ రూరల్ : నిరుపేద సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల జారీకి, ఇండ్ల నిర్మాణాల కోసం ప్రక్రియ జరుగుతుందన్నారు. దళితులకు రూ.10లక్షలు ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ రూపొందించి, అమలు చేస్తున్నారన్నారు.
కరోనాతో చాలా రాష్ట్రాల్లో పెన్షన్ల పంపిణీ నిలిపివేసినా.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తెలంగాణలో పెన్షన్లు మాత్రం ఆపలేదన్నారు. కేంద్రం సహకరించకున్నా పేదల కోసం ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని నిలిపివేయలేదని చెప్పారు. అప్పులు తెచ్చి అన్నింటినీ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. రూ.167కోట్లను రైతుబంధు కోసం రూరల్ జిల్లాలోనే ఖర్చు పెట్టినట్లు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రతీ గ్రామం అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో 1.87లక్షల కుటుంబాలకు రేషన్కార్డులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. రూ.40లక్షల వ్యయంతో కరోనా నివారణకు నియోజకవర్గంలో హోమియోపతి మందులు అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ హరిత, ఎంపీపీ అనిమిరెడ్డి, తహశీల్దార్ సత్యనారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.