హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : అధికారులతో సమీక్షించి ధాన్యం కొనుగోలులో వేగం పెరిగేలా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సీపీఐఎల్పీ లీడర్ కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు లేఖ రాశారు. మిల్లులకు వెళ్లిన లారీల్లోంచి ధాన్యం అన్లోడ్ చేయడం ఆలస్యమవుతుండటం కొనుగోలుకు ఆటంకంగా మారిందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో ధాన్యం లోడ్ చేసుకొనేందుకు లారీల యజమానులు భయపడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరతతో ధాన్యం సేకరణ పూర్తిగా మందగించిందని, రైతులు కాంటా కోసం పడిగాపులు కాయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వివరించారు. మక్కజొన్న కొనుగోలులో సంక్షోభాన్ని నివారించాలని కోరారు.
హైదరాబాద్, మే8 (నమస్తే తెలంగాణ) : నాయీబ్రాహ్మణులపై కాంగ్రెస్ చిన్నచూపు చూస్తున్నదని, భవిష్యత్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నామినేటెడ్ పదవుల్లో ఒక్క పదవినైనా నాయీబ్రాహ్మణులకు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా అవమానించిందని నిప్పులు చెరిగారు. నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పంద న లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కార్పొరేషన్ ఏర్పాటు చేసి, చైర్మన్ను నియమించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, ఆ నిధులు నేరుగా నాయీబ్రాహ్మణ కుటుంబాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ప్రకటనలో హెచ్చరించారు.