అన్నపురెడ్డిపల్లి/ అశ్వారావుపేట/ పర్ణశాల/ పాల్వంచ రూరల్/ దమ్మపేట, మే 8: గత కొద్దిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో అన్నదాతలు అతలాకుతలమవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన యాసంగి వరి ధాన్యం, మొక్కజొన్నలు తీరా చేతికొచ్చాక వర్షార్పణం అవుతున్నాయి. శుక్రవారం సైతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, బూర్గంపహాడ్, పాల్వంచ, దమ్మపేట తదితర మండలాల్లో వర్షం కురిసింది.

దీంతో ఆయా గ్రామాల్లో ధాన్యం, మొక్కజొన్న బస్తాలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని, మొక్కజొన్నలను వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడ్డారు. అప్పటికప్పుడు పట్టాలు కప్పి పంటలను తడవకుండా జాగ్రత్తలు తీసుకోవటానికి కష్టపడ్డారు. అయితే అధికారులు సకాలంలో ధాన్యం, మొక్కజొన్నలను కొనుగోలు చేస్తే ఇన్ని ఇబ్బందులు ఉండేవికావని, ఇప్పటికైనా కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరికొద్దిరోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ ప్రకటించటంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
