హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8 (నమస్తే తెలంగాణ) : ధర్మవాణి ధర్మం తప్పింది! ధర్మవాణిలో స్వీకరించిన వినతిపత్రాలపై సాక్షాత్తు దేవాదాయ శాఖ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలకే దిక్కులేకుండా పోతున్నది. మార్చి 16వ తేదీన దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ధర్మవాణిలో పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి ఆగమం విషయంలో అక్కడి అర్చకులు కమిషనర్కు ఒక వినతిపత్రం అందజేశారు. అదేరోజు సీ సెక్షన్లో దీనికి సంబంధించి ఫైల్ పుటప్ చేసి ఈవో నుంచి నివేదిక కోరాలని చెప్పినా ఇప్పటివరకు అంటే నెలన్నర దాటినా సదరు ఈవోకు ఎలాంటి లేఖ రాలేదు. మూడునెలల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రముఖ అమ్మవారి దేవాలయానికి సంబంధించి ఓ ఉద్యోగి విషయమై విచారణ చేయాలని ఎంక్వైరీ ఆఫీసర్ను నియమిస్తూ కమిషనర్ నుంచి నోట్ఫైల్ వచ్చినా ఆ సెక్షన్ నుంచి మాత్రం సదరు విచారణాధికారికి కానీ, దేవాలయానికి కానీ ఎలాంటి లేఖ కూడా అందలేదు. దీంతో విచారణకు చాలా సమయం పట్టింది. ధర్మవాణిలో దేవాలయాల అర్చక ఉద్యోగులకు సంబంధించిన సమస్యలతోపాటు ఆ శాఖకు సంబంధించిన అనేక అంశాలపై వెంటవెంటనే నిర్ణయాలు తీసుకొని ఉత్తర్వులు జారీ చేయడంతో ధర్మవాణికి తొలి వారం నుంచే స్పందన లభించింది. అయితే, కమిషనర్ ఎంత చిత్తశుద్ధితో పనిచేసినా మిగతా సెక్షన్లకు సంబంధించిన సిబ్బంది సరిగా పనిచేయకపోవడంతో చాలావరకు కమిషనర్ రాసిన నోట్ఫైల్స్కు సంబంధించిన ఉత్తర్వులు బట్వాడా జరుగడం లేదని అర్చక ఉద్యోగులు చెప్తున్నారు.
దేవాదాయ శాఖలో ఫైళ్లన్నీ వెంటవెంటనే క్లియరెన్స్ చేయాలని ఆదేశిస్తూ గత సంవత్సరం జూలైలో మంత్రి కొండా సురేఖ అట్టహాసంగా ఈ-ఆఫీసు ప్రారంభించారు. ఒకట్రెండురోజులు ఫైల్స్ ముందుకు కదిలినప్పటికీ, ఆ తర్వాత ఈ-ఆఫీసు ముచ్చటే మరచిపోయారు. అసలు కంప్యూటర్లో ఫైల్ అప్లోడ్ చేయాలంటే ఏ,బీ, సీ సెక్షన్లలో ఆ ఆరుగురు ఉద్యోగులకు కచ్చితంగా డబ్బులు ముట్టాల్సిందే. ఒక్కో ఫైల్ దాని తీరును బట్టి రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు రేటు నిర్ణయించారు. ఇటీవల ఆఫీసులోని మొదటి అంతస్తులో ఏసీబీ తనిఖీలు జరుగుతున్న సమయంలో కూడా ఒక సెక్షన్లో పనిచేస్తున్న ఉద్యోగి ఉత్తర తెలంగాణలోని ఒక ప్రధాన శివాలయానికి సంబంధించిన ఫైల్ ముందుకు కదిలించడానికి రూ.20వేలు ముడుపులు తీసుకున్నారని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో అప్పట్లో చర్చ జరిగింది. ఒక సూపరింటెండెంట్పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన సెలవు పెట్టి వెళ్లిపోయారు. ధర్మవాణితో సమస్యలు తీరుతాయని ఉద్యోగులు భావించినప్పటికీ కమిషనర్ నోట్ఫైల్పై సంతకం చేసి ఇచ్చిన తర్వాత సెక్షన్ల వారీగా జరుగాల్సిన వ్యవహారంలో ప్రతిచోటా డబ్బులు ముట్టకపోతే ఆ ఫైల్ అటకెక్కినట్టేనని అర్చక ఉద్యోగులు చెప్పారు.
క్షేత్రస్థాయిలో ఫైల్ కదలాల్సిన ఇన్వార్డ్ నుంచి మొదలుపెడితే కమిషనర్ చాంబర్ వరకు ప్రతిచోటా ఎంతోకొంత ముట్టజెప్పకపోతే ఫైల్ కదిలే సమస్యే లేదు. కమిషనర్ చాంబర్లో వందల కొద్ది ఫైళ్లు పేరుకొనిపోగా హనుమంతరావు బాధ్యతలు స్వీకరించాక వాటికి కొంతమేరకు పరిష్కారం లభించింది. ఆఫీసులో ఉన్న కొందరు డిప్యూటీ స్థాయి అధికారుల సహకారంతో కొందరు సూపరింటెండెంట్లు, మరికొందరు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఈ లంచాల బాగోతంలో కీలక భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారంటూ దేవాదాయ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. కమిషనర్ నేరుగా రంగంలోకి దిగి సెక్షన్ల వారీగా ప్రక్షాళన చేసి ఈ ఆఫీసును పునరుద్ధరిస్తే తప్ప ఈ ముడుపుల బాగోతానికి తెరపడేది లేదని, నెలల తరబడి ఆగిపోతున్న ఫైళ్లకు మోక్షం లభిస్తుందని దేవాలయాల సిబ్బంది చెప్పుకొంటున్నారు. ఏండ్ల తరబడి తిష్ట వేసిన ఉద్యోగులను బదిలీ చేస్తే పరిస్థితి చక్కబడుతుందని కొందరు ఉద్యోగులు అంటున్నారు.