కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మే 2న జరిగే కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులకు సలహాలు, సూచనలు ఇస్తారని టీఎంసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. అభ్యర్థులంతా తమ కౌంటింగ్ ఏజెంట్లతో వర్చువల్ సమావేశానికి హాజరు కావాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీపై మమతా ధీమాగా ఉన్నారు. లెక్కింపు ప్రక్రియలో బీజేపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనే ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎన్నికల కమిషన్పై పలుసార్లు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఎన్నికల కమిషన్పై సైతం విశ్వాసం లేదని, ఈ మేరకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు ఆమె నిర్ధిష్ట మార్గదర్శకాలు జారీ చేస్తారని సదరు నేత పేర్కొన్నారు. ‘ప్రస్తుతం బీజేపీ బెంగాల్పై దృష్టి సారించినందున.. విజయం సాధించేందుకు దేనికైనా ప్రయత్నం చేయొచ్చు’ అని మరో నేత ఆరోపించారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం ముమ్మరంగా ప్రచారం చేయగా.. టీఎంసీ తరఫున మమతా బెనర్జీ అన్ని తానై ప్రచారం నిర్వహించారు.