న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కరోనా మహమ్మారి విలయతాండవంతో అల్లాడిపోతున్న భారత్.. వివిధ దేశాల సాయం కోసం ఎదురుచూస్తున్నది. మెడికల్ ఆక్సిజన్, వెంటిలేటర్లు, వైద్య పరికరాలతో పాటు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల చికిత్సకు ఇచ్చే ‘రెమ్డెసివిర్’ ఔషధం కొరత దవాఖానలను వేధిస్తున్నది. దీంతో ‘రెమ్డెసివిర్’ డ్రగ్ను సరఫరా చేయాల్సిందిగా ఉజ్బెకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి చిన్న దేశాలకు కూడా భారత్ విజ్ఞప్తులు చేస్తున్నది. సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కేసులు పెరుగడంతో రెమ్డెసివిర్ వాడకం ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది. డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో ఒక్కో ఇంజెక్షన్ ధర రూ.35 వేలకు చేరింది. దీంతో భారత్ విజ్ఞప్తుల మేరకు ఆ ఔషధాన్ని ఉత్పత్తి చేస్తున్న అమెరికా ఫార్మా సంస్థ ‘గిలీడ్ సైన్సెస్’.. 4.5 లక్షల వయల్స్ను సరఫరా చేసేందుకు ఇటీవల అంగీకరించింది. అలాగే, ‘రెమ్డెసివిర్’ దిగుమతులపై ఉన్న సుంకాన్ని భారత్ రద్దు చేసింది. అయినప్పటికీ, డిమాండ్కు తగిన సరఫరాను చేరుకోవడం కష్టమవుతున్నది. దీంతో ‘రెమ్డెసివిర్’ను సరఫరా చేయాల్సిందిగా ఉజ్బెకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, యూఏఈ తదితర దేశాలను భారత్ కోరింది. ఈ విజ్ఞప్తికి ఆ దేశాలు సానుకూలంగా ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి.
16 ఏండ్ల విధానానికి చెల్లు
విపత్తు సమయాల్లో సాయం తీసుకోకుండా స్వయంగా నిలదొక్కుకోవాలని గత 16 ఏండ్లుగా భారత్ పాటిస్తున్న విధానానికి కరోనా తూట్లు పొడిచింది. దేశంలో రోజుకు సగటున మూడున్నర లక్షల కేసులు నమోదవుతుండటంతో వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నెలకొన్నది. మెడికల్ ఆక్సిజన్, మందులు, వ్యాక్సిన్, పడకలు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, రెస్పిరేటర్లు, ఎలక్ట్రిక్ సిరంజ్ పుషర్లతో పాటు మాస్కులు, గ్లౌజుల కొరత ఏర్పడింది. దీంతో విపత్తు సమయాల్లో విదేశాల నుంచి సాయం కోరకూడదనుకున్న ‘2004 పాలసీ’కి భారత్ చరమగీతం పాడింది. విదేశాల సాయం లేకపోతే, దేశంలో పరిస్థితులు మరింతగా దిగజారుతాయనే ఈ నిర్ణయం తీసుకున్నది. ఉత్తరకాశీ భూకంపం (1991), లాతూర్ భూకంపం (1993), గుజరాత్ భూకంపం (2001), బెంగాల్ తుఫాన్ (2002), బీహార్ వరదలు (జూలై 2004) వంటి విపత్తుల సమయాల్లో భారత్ విదేశాల సాయాన్ని తీసుకున్నది. అయితే, 2004 డిసెంబర్లో సునామీ విలయం ప్రభావం దేశంలోని దక్షిణాది రాష్ర్టాలపై కూడా పడింది. అయితే ప్రపంచ దేశాల సాయం లేకుండానే భారత్ అప్పుడు త్వరగానే కోలుకున్నది. ఇదే సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. విపత్తు నిర్వహణలో భారత్ స్వయంసమృద్ధి సాధించినదని, ఇకపై ఇతర దేశాల సాయం తీసుకోకపోవచ్చని ప్రకటించారు.
అలా కశ్మీర్ భూకంపం (2005), ఉత్తరాఖండ్ వరదలు (2013), కశ్మీర్ వరదలు (2014) వంటి విపత్తుల సమయాల్లో భారత్ విదేశాల సాయాన్ని తీసుకోలేదు. 2018లో కేరళలో వరదలు బీభత్సం సృష్టించగా.. యూఏఈ రూ.700 కోట్ల సాయం చేయడానికి ముందుకొచ్చింది. అయితే, దీన్ని కేంద్రం సున్నితంగా తిరస్కరించింది. ప్రస్తుతం కరోనా సృష్టిస్తున్న ఉద్ధృతిని అడ్డుకోవడంలో భారత్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నది. దీంతో విదేశాల సాయాన్ని కోరుతున్నది. కాగా, పొరుగు దేశం చైనా నుంచి కూడా అవసరమైన వైద్య సాయాన్ని పొందడానికి భారత్ సిద్ధంగా ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ నుంచి సాయం తీసుకోవాలా? వద్దా? అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నాయి. మరోవైపు, భారత్కు సాయం చేయడానికి 40 దేశాలు ముందుకొచ్చాయని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.
ప్రపంచ దేశాల చేయూత
కరోనాతో అతలాకుతం అవుతున్న భారత్కు సాయం అందించడానికి పలు దేశాలు ముందుకొచ్చాయి. భారత్కు వెంటనే 400 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, మూడు ఆక్సిజన్ జనరేషన్ యూనిట్లను పంపేందుకు బ్రిటన్ సిద్ధమైంది. భారత్ కోసం 20 ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు, 75 వెంటిలేటర్లు, 2 లక్షల ప్యాకెట్ల ఔషధాలు పంపుతున్నట్టు రష్యా ప్రకటించింది. 120 వెంటిలేటర్లు, మొబైల్ ఆక్సిజన్ యూనిట్లను పంపుతున్నట్టు జర్మనీ వెల్లడించింది. మరోవైపు, రష్యా, బ్రిటన్ పంపిన తొలి దఫా వైద్య పరికరాలు గురువారం ఢిల్లీ విమానాశ్రయాన్ని చేరుకున్నాయి. గూగుల్, అమెజాన్, బ్లాక్స్టోన్ వంటి సంస్థలు కూడా భారత్కు తమ సాయాన్ని అందిస్తున్నాయి. దేశంలో ఆక్సిజన్ సంబంధిత వైద్య పరికరాల కొరత నేపథ్యంలో 17 మెడికల్ డివైజెస్ను మూడు నెలలపాటు దిగుమతి చేసుకోవడానికి కేంద్రం అనుమతించింది.