ఇల్లెందు, మే 9 : మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు గ్యారెంటీ లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన విషయాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. పదేళ్లు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఏమీ చేయకుండా ఇప్పుడు దేవుళ్ల పేరుతో ఓట్లు అడుగుతోందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చి గర్జించిన తర్వాతే రేవంత్ రైతుబంధు ఇస్తున్నారన్నారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి గత కేసీఆర్ ప్రభుత్వం సుమారు రూ.3 వేల కోట్లు ఇచ్చిందని గుర్తు చేశారు. పదేళ్లు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, నాయకులు దిండిగాల రాజేందర్, జేకే శ్రీను, సిలివేరు సత్యనారాయణ, పరుచూరి వెంకటేశ్వర్లు, శీలం రమేశ్, గిన్నారపు రాజేశ్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఆళ్లపల్లి/గుండాల, మే 9 : కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ప్రజల గొంతుకను పార్లమెంట్లో వినిపిస్తానని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత అన్నారు. గురువారం ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీ పరిధిలోని పెద్దురు గ్రామంలో జడ్పీటీసీ కొమురం హనుమంతరావు నివాసంలో, గుండాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బూటకపు గ్యారెంటీతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. మాట తప్పిన కాంగ్రెస్ నాయకుల విధానాలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించి నిలదీయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కష్టాలు మళ్లీ వచ్చాయని, రైతాంగం పంటలు పండించుకోవడానికి ఇబ్బందులు పడుతోందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపిస్తే ఏజెన్సీ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంట్లో చర్చించి పరిష్కారమయ్యేలా చూస్తానన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాలంటే ఈ నెల 13న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కొండ్రు మంజుభార్గవి, ఆళ్లపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాయం నరసింహారావు, షేక్ బాబా, నాయకులు రాంబాబు, వెంకటేశ్, సతీశ్, సత్యం, రవి, సమ్మయ్య, భవాని శంకర్, వట్టం రాంబాబు, గుండాల బీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు తెల్లం భాస్కర్, రవీందర్రెడ్డి, రాంమూర్తి, శ్రీనివాస్, గుండ్ల రంజిత్, టి.రాము, అటికం నాగేశ్వరరావు, పొంబోయిన సుధాకర్, గొగ్గెల రాంబాబు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.