లక్ష్మీదేవిపల్లి, మే 16 : గిరిజనుల ప్రకృతి సంపద తునికాకు(బీడీ ఆకు) సేకరణ ప్రారంభమైంది. దీంతో ఏజెన్సీ గ్రామాల్లో జాతరను తలపిస్తున్నది. గిరిజనులు వేకువజామునే లేచి పిల్లలు, పెద్దలు తేడాలేకుండా ప్రతి ఒక్కరూ తునికాకు సేకరణలో నిమగ్నమవ్వడంతో సందడి వాతావరణం నెలకొంది. చెట్టూపుట్టా తిరుగుతూ తునికాకు సేకరిస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో తునికాకు కార్మికులు తెల్లవారుజామున చీకటితోనే అడవులకు వెళ్తున్నారు.
ఉదయం 9 గంటల్లోపు ఆకులు సేకరించి ఇళ్లకు చేరుకుంటున్నారు. అనంతరం సేకరించిన ఆకును ఇంటి వద్దనే చెట్ల నీడకు చేరుకొని ఇరుగుపొరుగు వారు చుట్టూ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఆకులను కట్టలుగా కడుతున్నారు. 50 ఆకుల కట్టకు ప్రభుత్వం మూడు రూపాయలు చెల్లిస్తుండడంతో మరింత సందడి నెలకొంది. ఇలా కట్టిన ఆకుల కట్టలను సాయంత్రం వేళల్లో సమీపంలోని కల్లాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు. తునికాకు సేకరించి కట్టలుగా కట్టి తీసుకొచ్చిన ఆకును కల్లాల్లో వారం రోజులపాటు ఆరబెట్టిన తర్వాత వాటిని బస్తాల్లో నింపి సంబంధిత కాంట్రాక్టర్లు గోడౌన్లకు తరలిస్తున్నారు.
తునికాకు పనులతో కార్మికులకు సుమారు నెలరోజులపాటు చేతినిండా పని, పనికితగ్గ వేతనం కూడా లభిస్తుంది. ఏజెన్సీలో ప్రతి ఏటా తునికాకు సీజన్ మార్చి నెల నుంచి ప్రూనింగ్ పనులు మొదలుపెడతారు. అంటే తునికి చెట్ల మండలు కొడతారు. మండలు కొట్టిన 40 రోజుల తర్వాత ఆ ప్రదేశంలో తునికాకులు ఏపుగా చిగురిస్తుంది. అలా ఏపుగా పెరిగిన ఆకును కార్మికులు చెట్టూ పుట్టా తిరిగి సేకరిస్తారు. మండ కొట్టడంతో ప్రారంభమైన తునికాకు సేకరణ కల్లాల్లో ఆరబెట్టడం, ఉల్టాపల్టా(ఒకవైపు ఆరిన ఆకును మరోవైపుకు తిప్పడం), తర్వాత ఆరిన ఆకులను బస్తాల్లో నింపి కాంట్రాక్టర్లు గోడౌన్కు తరలిస్తారు. దీంతో తునికాకు కార్మికులకు నెల రోజులపాటు చేతినిండా పని, పనికితగ్గ వేతనం కూడా లభిస్తుంది. గ్రామాల నుంచి సుమారు పది కిలోమీటర్ల వరకు అటవీ ప్రాంతానికి వెళ్లి ఆకు సేకరణ చేసి తిరిగి వస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 6 ఫారెస్టు డివిజన్ల పరిధిలో ఆకు సేకరణ జరుగుతుంది. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని ఫారెస్టు డివిజన్లుగా ఉన్నాయి. 30 యూనిట్లలో 667 కల్లాలను సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. ఆరు డివిజన్లలో 35 వేల స్టాండర్డు బ్యాగులు లక్ష్యంగా సేకరించాలని నిర్ణయించారు. దాదాపు రెండు వారాల నుంచి తునికాకు సేకరణ జరుగుతోంది. ఇప్పటి వరకు సుమారు 15 వేల స్టాండర్డ్ బ్యాగులను సేకరించినట్లు తెలుస్తుంది. మరో 15వేల బ్యాగుల ఆకు సేకరణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ పనులను కాంట్రాక్టర్లు, అటవీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తునికాకుకు గత ఏడాది కంటే ఈ ఏడాది ఆకు ధరను పెంచడంతో ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు.
కాంట్రాక్టర్ల ద్వారా 50 ఆకుల కట్టకు రూ.3 చొప్పున చెల్లించనుంది. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.3 చొప్పున రేటు నిర్ణయించడంతో తునికాకు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ తునికాకు సేకరణలో పిల్లలు, పెద్దలు, మహిళలు ఇలా అందరూ ఆకు సేకరణకు వెళ్తున్నారు. ప్రతి కార్మికుడికి రోజుకు 100 నుంచి 500 కట్టల వరకు వారి శక్తిని బట్టి తేగలుగుతున్నాయి. కార్మికులకు రోజుకు రూ.200 నుంచి రూ.700 వరకు ఆదాయం పొందగలుగుతున్నారు.
ఈ ఏడాది అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది ఆకు నాణ్యత బాగుంది. ఆకు సేకరణ కూడా ముమ్మరంగా జరుగుతోంది. ఎండలు విపరీతంగా ఉన్నందువల్ల కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం వేళల్లో మాత్రమే ఆకు సేకరణకు వెళ్లి ఎండ తీవ్రత పెరగకముందే ఇళ్లకు చేరుకుంటే మంచిది.
– కిష్టాగౌడ్, డీఎఫ్వో