Atishi : కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై తీహార్ జైలు నుంచి బయటికి రావడాన్ని బీజేపీ ఓర్వలేకపోతున్నదని ఆప్ సీనియర్ నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. కేజ్రీవాల్కు చెడ్డపేరు తేవడం కోసం బీజేపీ రకరకాల కుట్రలు పన్నుతున్నదని ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే ఈ నెల 13న స్వాతి మాలివాల్ను కేజ్రీవాల్ నివాసానికి పంపించారని అన్నారు. బీజేపీ కుట్రలో స్వాతి మాలివాల్ పావులా మారిందని మండిపడ్డారు.
వాస్తవానికి సీఎం కేజ్రీవాల్ను దోషిని చేయాలని వాళ్లు కుట్ర పన్నారని, కానీ గొడవ జరిగిన సమయంలో కేజ్రీవాల్ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని అతిషి వ్యాఖ్యానించారు. అప్పాయింట్మెంట్ తీసుకోకుండానే స్వాతిమాలివాల్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారని, అప్పాయింట్మెంట్ కాపీ చూపించమని భద్రతా సిబ్బంది అడిగడంతో వారితో గొడవ దిగారని ఆరోపించారు. సోఫాలో దర్జాగా కూర్చుని పోలీసులను బెదిరించారని చెప్పారు. జోక్యం చేసుకున్న విభవ్ కుమార్తో కూడా ఆమె దుర్భాషలాడారని అన్నారు.
పైగా విభవ్ కుమార్ తనపై దాడి చేశారని స్వాతి మాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, తనను కాలితో తన్నాడని, బట్టలు చించాడని, తలను టేబుల్కేసి కొట్టాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. వాస్తవానికి ఆమెపై దాడి అనేదే జరగలేదని చెప్పారు. ఇవాళ బయటికి వచ్చిన వీడియో క్లిప్పింగే అందుకు నిదర్శనమని అన్నారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు కూడా లేవని చెప్పారు. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది.