పాట్నా : బిహార్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా రోజువారీ కొవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న ఒకే రోజు దాదాపు ఎనిమిది వేల వరకు కొవిడ్ కేసులు నమోదవగా.. యాక్టివ్ కేసులు 40వేల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం సీఎం నితీశ్కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం సమావేశం కానుంది. ఇందులో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశం ఉందని, లేదంటే కొత్తగా కఠినంగా కొవిడ్ మార్గదర్శకాలు జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ నిర్ణయం తీసుకున్నా నిబంధనలు కఠినంగానే ఉంటాయని సమాచారం.
పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య శుక్రవారం వివిధ శాఖలతో సీఎం నితీశ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అలాగే గవర్నర్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితిని వివరించి, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను తీసుకుంది. అనంతరం సీఎం మాట్లాడుతూ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడిన అనంతరం.. లాక్డౌన్, లేదంటే వైరస్ నియంత్రణకు కఠిన మార్గదర్శకాలు ప్రభుత్వం జారీ చేస్తుందని చెప్పారు.
ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీలన్నీ లాక్డౌన్ను వ్యతిరేకించాయి. గతంలో విధించిన లాక్డౌన్ ఎందరో కూలీలు ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోసారి లాక్డౌన్ విధిస్తే ఉపాధి ఏంటని పార్టీలు ప్రశ్నించాయి. ఈ క్రమంలో ఉపాధిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండనుంది. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్కు వెళ్లకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
వారాంతపు లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ సైతం విధించే ఆలోచన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పాఠశాలలు, కళాశాలలను మూసివేతను పొడగించవచ్చని, సినిమా థియేటర్లు, స్టేడియాలు, మ్యూజియంలు, జిమ్లు, ఆలయాలు మూసివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్రీడా కార్యకలాపాలపై పరిమితులు, వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు గరిష్ఠంగా వంద, 150 మందికి, అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 50 మందికి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతానికి ఆర్థిక కార్యకలాపాల విషయంలో ప్రభుత్వం సడలింపులు ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు. షాపింగ్ మాల్స్, దుకాణాలు, నిర్ణీత సమయం నిబంధనలతో పాటు భౌతిక దూరం, పరిశుభ్రత, మాస్క్లు ధరించడం వంటి నిబంధనలు పాటిస్తూ కొనసాగించే అవకాశం ఉంది. అలాగే ఆన్లైన్ డెలివరీలకు, ప్యాకింగ్ కోసం రెస్టారెంట్లు, దాబాలకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసులు, పెట్రోల్ పెంపులు సైతం తెరిచే ఉండనున్నాయి.
రాష్ట్రంలో రవాణాపై ఎలాంటి ఆంక్షలు విధించే అవకాశం లేకుండగా.. రైల్వే, ఎయిర్పోర్ట్ల వద్ద నిబంధనలు కఠినతరం చేయనున్నారు. అలాగే ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల హాజరును 33 శాతం నుంచి 50 శాతానికే పరిమితం చేయాలని అధికార యంత్రాంగం యోచిస్తోంది. అత్యవసరమైన సేవలకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..