హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధతగల రాజకీయవేత్త దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద జల దృశ్యంలో ఆయన విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమం, నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న గొప్ప నేత బాపూజీ అన్నారు. స్వరాష్ట్రం కోసం 75ఏళ్లు ఉద్యమం చేశారు . బడుగు బలహీనవర్గాల అభివృద్ది కొరకు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి మరువలేనిదన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటుకు తాను ఉంటున్న జల దృశ్యాన్ని అప్పగించిన మహోన్నత వ్యక్తి గా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోతారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి అనేక సేవలు చేశారని గుర్తు చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు నేటి తరానికి అనుసరనీయమన్నారు.
కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ముఠా గోపాల్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ ఉన్నారు.