దుబ్బాక, మే 2: మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండేనని, బీజేపీ, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తరుఫున ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకలో ప్రచారం చేపట్టారు. రేకులకుంట మల్లికార్జునఆలయంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం రేకులకుంట, రాజక్కపేట గ్రామాల్లో ఎమ్మెల్యే ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి కటౌట్లతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఇంటింటికెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలుకరిస్తూ కారు గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మవద్దన్నారు. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను నిలువునా మోసగించిందన్నారు. ప్రజల మధ్య మత విద్వేషాలతో చిచ్చుపెడుతున్న బీజేపీకి ఓటుతో గుణపాఠం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ను ఓడించేందుకు ఆ రెండు పార్టీలు ఒక్కటయ్యాయని దుయ్యబట్టారు.
తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమన్నారు. విద్యావంతుడైన వెంకట్రామిరెడ్డికి ఓటేస్తే మన దుబ్బాక మరింత అభివృద్ధి చెందుతుందని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నిస్వార్థంతో ప్రజాసేవకు అంకితమైన వెంకట్రామిరెడ్డి గురించి గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. పేదల సంక్షేమం కోసం వెంకట్రామిరెడ్డి రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పీవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ఫంక్షన్హాల్స్ నిర్మాణం చేపట్టి నిరుపేదలకు ఒక్క రూపాయికి ఫంక్షన్ హాల్ వినియోగం, నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యకు కావాల్సిన ఆర్థికసాయం, పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ అవకాశం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని చెప్పారు. ప్రచారంలో దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, ఎంపీపీ పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మనోహర్రావు, రాజమౌళి, వెంకటనర్సింహారెడ్డి, రజినీకాంత్రెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.