న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ నుంచి దేశం బయటపడుతున్నది. రోజువారీ కేసులతో పాటు మరణాలు దిగి వస్తుండడం ఊరట కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 58,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. 81 రోజుల తర్వాత 60వేల కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. కొత్తగా 87,619 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని పేర్కొంది. మరో వైపు 24 గంటల్లో 1,576 మరణాలు నమోదయ్యాయని చెప్పింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,81,965కు పెరిగాయి. ఇప్పటి వరకు 2,87,66,009 మంది బాధితులు కోలుకున్నారు.
వైరస్ బారినపడి మొత్తం 3,86,713 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 7,29,243 యాక్టవ్ కేసులున్నాయని తెలిపింది. టీకా డ్రైవ్లో భాగంగా 27,66,93,572 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.27 శాతానికి పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికి కన్నా తక్కువగా ఉందని మంత్రిత్వ శాఖ చెప్పింది. ప్రస్తుతం వ్లీకీ పాజిటివిటీ రేటు 3.43 శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 3.22 శాతం ఉందని.. వరుసగా 13 రోజుల్లో ఐదుశాతానికి కన్నా తక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వివరించింది. దేశంలో నిన్నటి వరకు 39.10 కోట్ల కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.