న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మరోసారి పెరిగాయి. గురువారం వరుసగా రెండో రోజు రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 54,069 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 68,885 మంది బాధితులు కొలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 1,321 మంది వైరస్ బారినపడి కన్నుమూశారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778కు పెరిగింది. ఇందులో 2,90,63,740 మంది బాధితులు కోలుకున్నారు.
వైరస్ బారినపడి మొత్తం 3,91,981 మంది మృతి చెందారని మంత్రిత్వశాఖ వివరించింది. టీకా డ్రైవ్లో భాగంగా 30,16,26,028 డోసులు పేర్కొన్నట్లు చెప్పింది. జాతీయ రికవరీ రేటు 96.61శాతానికి పెరిగిందని మంత్రిత్వశాఖ చెప్పింది. వీక్లీ పాజిటివిటీ రేటు ఐదు శాతానికి తక్కువగా ఉందని.. ప్రస్తుతం 3.04శాతంగా ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.91శాతానికి తగ్గిందని చెప్పింది. ఇప్పటి వరకు మొత్తం 39.78 కోట్ల కొవిడ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపింది.