హైదరాబాద్ : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. దీంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేయడంతో పాటు సడలింపులు ఇస్తున్నాయి. దీంతో ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో రైల్వేశాఖ సర్వీసులను ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 24 ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న సర్వీసులు.. తదుపరి ఆదేశాలు వచ్చేదాకా కొనసాగుతాయని పేర్కొంది. ఆయా రైళ్లన్నీ పూర్తిగా రిజర్వుడు సర్వీసులేనని సీపీఆర్ఓ సీహెచ్ రాకేశ్ తెలిపారు. వీటిలో ఆరు రైళ్లు ప్రతిరోజూ రాకపోకలు కొనసాగించనున్నాయి. మరో 16 రైళ్లు వారంలో ఒకసారి, రెండు సర్వీసులు వారంలో రెండు సార్లు సేవలను అందించనున్నాయి.