శ్రీశైలం : శ్రీగిరులపై కొలువుదీరిన భ్రమరాంబ అమ్మవారి ఆలయంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభిస్తున్నట్లు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఈవో కేఎస్ రామారావు తెలిపారు. ప్రస్తుతం లోక కల్యాణార్థం ప్రతి పౌర్ణమి రోజున మాత్రమే అమ్మవారికి ప్రత్యేకంగా అర్చక పండితులతో నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల్లోని భక్తుల కోరిక మేరకు తొలిసారిగా పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ప్రతి నెలా పౌర్ణమి తిథికి సేవలో పాల్గొనుకునే భక్తులు గోత్రనామాలను srisailadevasthanam.org వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని శ్రీశైలం టీవీ ఛానల్, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు శ్రీశైలప్రభ సంపాదకుడు అనీల్ కుమార్, టెక్నికల్ ఇన్చార్జి దివాకర్రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం కాల్ సెంటర్ 8333901951/2/3/4/5/6 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే సుమారు 600 మందికిపైగా భక్తులు లక్ష కుంకుమార్చన కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.