హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ) : రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో అంతా నేరాలమయం అయ్యిందని ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో), పోలీస్ వార్షిక క్రైమ్ నివేదికలే స్పష్టంచేస్తున్నాయి. మహిళలపై నేరాలు, మానవ అక్రమ రవాణా, సైబర్, ఆర్థిక నేరాల్లోనూ టాప్లో ఉండటం.. దేశవ్యాప్త క్రైమ్రేట్లో 5వ స్థానంలో ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఎన్సీఆర్బీ-2024 క్రైమ్ నివేదిక విడుదల చేసిన అన్ని నేరాల్లోనూ టాప్-10 లో తెలంగాణ ఉండటం సర్కార్ వైఫల్యానికి నిదర్శనం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే తీవ్రమైన నేరాల్లోనూ 3వ స్థానానికి చేరడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది.
మహిళలకు రక్షణ లేని కాంగ్రెస్ పాలన
తెలంగాణలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలకు రక్షణ కవచంలా ఉంటే.. కాంగ్రెస్ పాలన మాత్రం భక్షక ప్రభుత్వంగా మారిందని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలపై 24,495 నేరాలు నమోదైతే.. ప్రతి లక్ష మంది మహిళల్లో 128.6 మంది బాధితులవుతున్నారు. వెరసి మహిళలపై నేరాల్లో రాష్ట్రం ఈసారి తొలిస్థానంలో నిలిచి.. తలదించుకొనే పరిస్థితికి వచ్చింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మానవ అక్రమ రవాణాల్లో రాష్ట్రం మొదటిస్థానంలో ఉన్నట్టు ఎన్సీఆర్బీ నివేదిక చెప్తున్నది. దేశవ్యాప్తంగా నమోదైన మానవ అక్రమ రవాణాలో 20% కేసులు తెలంగాణవే ఉన్నాయి. మిస్సింగ్ కేసుల్లో దారుణ స్థితికి దిగజారింది. 2024లో 25,554 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో 4,614 మంది ఆచూకీ దొరకలేదని వెల్లడించింది.
పోక్సో కేసుల్లో పోటీపడటం సిగ్గుచేటు
చిన్నారులపై లైంగిక దాడి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న రాష్ర్టాల్లో ఈసారి టాప్-10 జాబితాలో చోటు ఉంటడం సిగ్గుచేటని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2024లో అన్ని సెక్షన్లు కలిపి పోక్సో కేసులు 2,934 నమోదు కాగా.. వాటిల్లో రేప్ కేసులే(సెక్షన్ 4, 6) 2,101 ఉన్నాయి. అంటే మన రాష్ట్రంలో రోజుకు సగటున ఆరుగురు ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. 2023తో పోల్చితే.. 2024లో పోక్సో కేసుల నమోదులో సుమారు 18.08% పెరిగి 7వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నేరాల రేటు పెరుగుతూనే ఉన్నా.. వాటిని అరికట్టాల్సిన పోలీసు వ్యవస్థ, నిఘా వ్యవస్థలు రాజకీయ మత్తులో జోగుతున్నాయని విమర్శిస్తున్నారు. పోలీసుశాఖ విడుదల చేసిన వార్షిక క్రైమ్ నివేదిక-2025లో చిన్నారులపై దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజూ రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట చిన్నారులపై మూడు రేప్లు జరుగుతున్నాయి. రోజుకు 8కి పైగా పోక్సో కేసులపై ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి. 2025లో 819 మంది చిన్నారులపై లైంగిక దాడులు జరిగాయి. 2,570 మందిపై లైంగిక వేధింపులు నమోదయ్యాయి.
ఆందోళన కలిగిస్తున్న హత్యలు, దోపిడీలు
రాష్ట్రంలో నడిరోడ్డుపై హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉన్మాది రాజ్కుమార్ ఘటన.. యావత్ దేశంలోనే సంచలనంగా మారింది. కాంగ్రెస్ పాలనలో 2024లో కేవలం 11 నెల్లలో దారుణమైన హత్యలు 856 జరిగితే.. 2025లో 781 నమోదయ్యాయి. డబ్బుల కోసం చేస్తున్న హత్యలూ మరింత కలవరపెడుతున్నాయి. 2024 ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం.. 12 నెలల్లో 1,040 హత్యలు నమోదయ్యాయి. పోలీసులంటే భయం లేకుండా పట్టపగలే దోపిడీలు, దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు ఏకంగా గన్లతో కాల్పులు జరిపి మరీ దోపిడీకి తెగబడుతున్నారంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంత దారుణ స్థితికి పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు.