న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మరణాలు నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నా మరణాలు మాత్రం తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. నిన్న నాలుగువేలకుపై మరణాలు నమోదవగా.. గడిచిన 24 గంటల్లో 4,529 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొంది. తాజాగా 3,89,851 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,96,330కి పెరిగాయి.
ఇప్పటి వరకు 2,19,86,363 మంది కోలుకున్నారు. మొత్తం 2,83,248 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 32,26,719 యాక్టివ్ కేసులు ఉన్నాయని చెప్పింది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్లో భాగంగా 18,58,09,302 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న భారీగా కొవిడ్ పరీక్షలు జరిగాయి. ఒకే రోజు 20.08లక్షల టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 32.03 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.