ట్యునిస్ : ట్యునీషియాలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మధ్యదరా సముద్రంలో పడవ మునిగి 57 మంది మృతి చెందారు. మరో 33 మందిని రక్షించినట్లు ట్యునీషియాకు చెందిన రెడ్ క్రెసెంట్ సంస్థ తెలిపింది. లిబియా నుంచి ఇటలీకి వెళ్తున్న వలసదారుల పడవ వెళ్తుండగా ట్యునీషియా తీరం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ట్యునిషియా తీరంలో పడవలు ముగిన సంఘటనలు జరిగాయి. ప్రస్తుతం వాతావరణం కాస్త మెరుగుపడినందున ట్యునీషియా, లిబియా నుంచి యూరప్ వైపు వలసలు పెరిగాయి. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో పడవలో 90 మంది ఉన్నారని.. 33 మంది ప్రాణాలతో బయటపడగా.. వీరంతా బంగ్లాదేశీయులని రెడ్ క్రెసెంట్ అధికారి మొంగి స్లిమ్ పేర్కొన్నారు.
ఘటనలో 57 మంది మృతి చెందారని భద్రతా వర్గాలు నిర్ధారించాయి. ట్యునీషియా తీరంలో పడవలు ముగిన ఘటనల్లో ఇటీవల సుమారు 60 మందిపైగా వలసదారులు మరణించారు. ఈ ఏడాది 23వేలకుపైగా వలసదారులు ఐరోపాకు సముద్రం మీదుగా వలస వచ్చారని.. చాలా మంది కొత్తగా ఇటలీ, స్పెయిన్కు ట్యునీషియా, అల్జీరియా నుంచి వచ్చారని యూఎన్హెచ్సీఆర్ పేర్కొంది. ఈ ఏడాదిలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 633 మంది మృతి చెందారని, గల్లంతయ్యారని ఏజెన్సీ అంచనా వేసింది.