న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ ఏడాదిలో ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చుతోంది. శనివారం రోజువారీ కేసులు 90వేలకు చేరువయ్యాయి. రోజు రోజుకు వైరస్ విజృంభించడంతో పాటు మరణాలు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 89,129 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
గతేడాది సెప్టెంబర్ 20 తర్వాత భారీగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మహమ్మారి ప్రభావంతో రికార్డు స్థాయిలో 714 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,23,92,260కు చేరగా.. మహమ్మారి ప్రభావంతో మొత్తం 1,64,110 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 44,202 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,15,69,241 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం 6,58,909 యాక్టివ్ కేసులున్నాయని కేంద్రం పేర్కొంది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 7,30,54,295 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది. మరో వైపు నిన్న ఒకే రోజు 10,46,605 టెస్టులు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 24.69కోట్లకుపైగా శాంపిల్స్ పరీక్షించినట్లు వివరించింది.
రాష్ట్రంలో కొత్తగా 1,078 కొవిడ్ కేసులు