Jagtial : జగిత్యాల భారత సైన్యం నిర్వహించే ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్లో పాల్గొనేందుకు వీలుగా తన కుమారుడిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) రాజధాని అబుధాబీ నుంచి అత్యవసరంగా స్వదేశానికి రప్పించాలని ఓ తల్లి ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ ని ఆశ్రయించింది. పాత గూడూరు గ్రామానికి చెందిన కొపర్తి అభిలాష్ను వెనక్కి రప్పించాలని తల్లి సుమలత అభ్యర్థించగా అధికారులు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.
ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన కొపర్తి అభిలాష్ ఓ గల్ఫ్ రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా టూరిస్ట్ వీసాపై జూలై 8న అబూధాబీకి వెళ్లాడు. అనంతరం జూన్ 13వ తేదీన అభిలాష్కు ఎంప్లాయిమెంట్ వీసా జారీ అయింది. అదే సమయంలో భారత సైన్యం నిర్వహించే ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఫిజికల్ స్క్రీనింగ్ (దేహదారుఢ్య పరీక్ష)కు అతడు ఎంపికైనట్టు జూలై 14న ఇ-మెయిల్ అందింది.
అయితే, ప్రస్తుతం అభిలాష్ పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యం అతడిని పంపిచేందుకు షరతు విధించింది. స్థానిక కరెన్సీ ప్రకారం 4,100 యూఏఈ దిర్హాములు (సుమారు ₹1.08 లక్షలు) జరిమానా చెల్లించి, ఎంప్లాయిమెంట్ వీసా రద్దు చేశాకే అతడిని భారత్కు పంపిస్తామని స్పష్టం చేసింది. రిక్రూటింగ్ ఏజెంట్ కూడా తమకు అదే విషయాన్ని చెబుతున్నాడని అభిలాష్ తల్లి సుమలత వాపోయింది. దిక్కుతోచని పరిస్థితుల్లో.. ఆమె ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ని ఆశ్రయించింది. తన కుమారుడు అగ్నివీర్ ఎంపిక ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని సుమలత కోరుతోంది. ఎలాగైనా తన బిడ్డను అత్యవసరంగా అబూధాబీ నుంచి స్వదేశానికి రప్పించాలని కోరుతూ హైదరాబాద్ బేగంపేట ప్రజా భవన్లో శుక్రవారం నిర్వహించిన ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో సుమలత వినతిపత్రం సమర్పించింది.
‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ స్టేట్ నోడల్ ఆఫీసర్ కె. విద్యాసాగర్ను కలిసిన సుమలత సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న తన కుమారుడి కల నెరవేరేలా సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె అభ్యర్థనపై వెంటనే స్పందించిన ఆయన, పేద కుటుంబానికి చెందిన యువకుడికి తగిన సహాయం అందించి అత్యవసరంగా స్వదేశానికి రప్పించే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జీఏడీ)కి లేఖ రాశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి బాధిత కుటుంబానికి మార్గనిర్దేశం చేశారు. ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’ హెల్ప్డెస్క్ లైజన్ ఆఫీసర్ భార్గవి నద్దునూరి, వాలంటీర్ గంగుల మురళీధర్ రెడ్డి తదితరులు.. సుమలతకు బాసటగా నిలిచారు.