Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీరు, తాగునీరు, విద్యుత్ సరఫరాలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిరోజూ రైతులకు అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్, ఇంటింటికీ తాగునీరు, పొలాలకు సాగునీరు అందించిందని గుర్తుచేశారు. ఆలేరు నియోజకవర్గం బొమ్మలరామారం మండలంలోని సోలేపేట విద్యుత్ సబ్స్టేషన్ను హరీశ్రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే సబ్స్టేషన్ లాగ్ బుక్ చేక్ చేసి, రైతులకు రోజుకు ఎన్ని గంటల కరెంటు సరఫరా చేస్తున్నారనే వివరాలను పరిశీలించారు.
అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. బొమ్మలరామారంలో చనిపోయిన మా పార్టీ కార్యకర్తను పరామర్శించడానికి వస్తే.. ఇక్కడి మహిళలు రెండు రోజులకు ఒకసారే నల్లా నీళ్లు వస్తున్నాయని తమ బాధలు చెప్పుకుంటున్నారని తెలిపారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి లాగా కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఐదేళ్ల పాటు రాష్ట్రమంతా నీళ్లు ఇస్తే.. ఉన్న వ్యవస్థను నడపడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావడం లేదని విమర్శించారు. మిషన్ భగీరథను సరిగ్గా నడిపితే ఆ పేరు బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు వస్తుందనే అక్కసుతోనే కావాలని నీళ్లు ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు.
సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్, జహీరాబాద్, కామారెడ్డి, యాదాద్రి, నల్గొండ, మహబూబ్ నగర్.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీశ్రావు తెలిపారు. మళ్ళీ బిందెలు పట్టుకుని మహిళలు రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి కనబడుతోంది. మీరు తెస్తామన్న ఆనాటి రోజులు అంటే ఇవేనా అని ప్రశ్నించారు. కరెంటు కోసం, ఎరువుల కోసం రైతులు ధర్నాలు చేయడం, తరుగు తీయడమేనా మీ మార్పు అని నిలదీశారు. రైతులు కరెంటు కోసం ఇబ్బంది పడుతున్నారని సోదరి సునీత చెబితే ఈరోజు సోలేపేట సబ్స్టేషన్కు సర్ప్రైజ్ విజిట్ కి వచ్చామని తెలిపారు. సబ్స్టేషన్ ఆపరేటర్ని అడిగితే.. మొన్నటి దాకా 14-15 గంటలు ఇచ్చాం సార్, ఈ వారం నుంచి కేవలం 12 గంటలే ఇవ్వాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి అని చెబుతున్నాడని తెలిపారు. ప్రభుత్వం ఇస్తున్న ఆ 12 గంటల కరెంటులో కూడా రెండు మూడు సార్లు ట్రిప్ అవుతోంది. 24 గంటల కరెంటుకు రైతాంగాన్ని ఎందుకు దూరం చేస్తున్నారని ప్రశ్నించారు.
కరెంటుకు మేమే పేటెంట్ అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్రావు గుర్తుచేశారు. మీ పేటెంట్ అంటే ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేయడమేనా అని ప్రశ్నించారు. నారుమళ్లు పోసుకునే, నాట్లు వేసుకునే ఈ కీలక సమయంలో నీళ్లు చాలా అవసరం. కరెంటు ఇవ్వకపోవడం వల్లే రాష్ట్రవ్యాప్తంగా సబ్స్టేషన్ల ముందు రైతులు ధర్నాలు చేస్తున్నారని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గం తిప్పర్తి మండలంలో, జగిత్యాల జిల్లా ఐలాపూర్, బాల్కొండ, కోహీర్ మండలం దిగ్వాల్, సిద్దిపేట జిల్లా కాజీపూర్, సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ సబ్స్టేషన్ల ముందు కేసీఆర్ 23,000 మెగావాట్ల విద్యుత్ స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టారని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో 15,000 మెగావాట్ల లోడు కూడా లేదు, ఎండాకాలం కూడా కాదు.. అయినా రైతులకు ఎందుకు కోతలు పెడుతున్నారని మండిపడ్డారు.
కోతలు పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమా అని హరీశ్రావు ప్రశ్నించారు. ఎన్నికల ముందు 4000 పెన్షన్, 15000 రైతుబంధు, మహిళలకు 2500, విద్యార్థి భరోసా అంటూ మాటల కోతలు కోశారని.. ఇప్పుడేమో కరెంటు, బోనస్, కేసీఆర్ కిట్, గొర్రెలు,చేపల పంపిణీ, రైతు బీమాలలో కోతలు పెడుతున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మొన్న వరంగల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంట్ కోతలే లేవని చెప్పారని.. మరి ఈరోజు నేను సోలేపేట సబ్స్టేషన్ రికార్డులు చూస్తే 12 గంటల కరెంటే ఇస్తున్నారు.. భట్టి గారు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 10-11 గంటల కరెంటే వస్తోంది. మీ మాటలు గడప దాటుతున్నాయి కానీ మీ పనులు గడప దాటడం లేదు. మీరు నిజంగా కడుపు నిండా 24 గంటల కరెంటు ఇస్తే రైతులు ఎందుకు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తారని నిలదీశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, బొగ్గు నిల్వలు లేకపోవడం వల్ల కేసీఆర్ నిర్మించిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 1600 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు మూతపడి నెలలు గడుస్తోందని హరీశ్రావు తెలిపారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా 270 మెగావాట్ల యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని పేర్కొన్నారు. సింగరేణి మన చేతిలోనే ఉన్నప్పటికీ 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ఆగిపోయిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఫ్రీ కరెంటు ఇస్తే పైసలు రావని, కరెంటు ఉత్పత్తి ఆపేసి రైతులకు కోతలు పెడుతున్నారా? కరెంటు లేక కాదు.. రేవంత్ రెడ్డికి మనసు లేక కరెంటు రావడం లేదని అన్నారు.రైతులకు మూడు గంటల కరెంటు చాలని గతంలో రేవంత్ రెడ్డి అన్నారు, ఇప్పుడు ఆ మాటనే నిజం చేయదలుచుకున్నారా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ ప్రజలకు ఎలాగైతే 24 గంటల కరెంటు వస్తుందో, బాయికాడ రైతుకు కూడా 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ పాలసీ అని హరీశ్రావు తెలిపారు. బీఆర్ఎస్ ముల్లు గర్రతో పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం కదలడం లేదు. దేవాదుల మోటార్లు ఆన్ చేయాలని మేము ప్రశ్నిస్తే తప్ప, నిద్రలేచి 5 నుంచి 9 మోటార్లు ఆన్ చేయలేదని అన్నారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాం.. యాదాద్రి, భద్రాద్రిలో ఆగిపోయిన 1870 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించి, రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. కరువు పరిస్థితుల్లో బోర్లు అడుగంటిపోయినప్పుడు రైతులకు కరెంటు అవసరం చాలా ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మిషన్ భగీరథపై వెంటనే రివ్యూ చేసి, ప్రతిరోజూ ప్రజలకు తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
మండలంలో వ్యవసాయ అధికారిని అడిగితే ఒక్క బొమ్మలరామారం మండలంలోనే 10 రైతు బీమాలు పెండింగ్ ఉన్నాయని చెప్పారన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారం రోజుల్లో 5 లక్షలు ఇచ్చేలా కేసీఆర్ గారు రైతు బీమా తెస్తే.. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 4000 మంది రైతులకు బీమా డబ్బులు ఐదు నెలలుగా రావడం లేదని తెలిపారు. రైతుబంధు ఎగ్గొట్టారు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ సగం ఎగ్గొట్టారు.. ఇప్పుడు రైతు బీమా కూడా ఎగ్గొట్టదలుచుకున్నారా అని ప్రశ్నించారు. ఎల్ఐసీకి ప్రభుత్వం ప్రీమియం కట్టలేదా? వెంటనే రైతు బీమాపై రివ్యూ చేసి చనిపోయిన 4000 మంది రైతుల కుటుంబాలకు తక్షణమే 5 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.