స్వాతంత్య్ర సమరస్ఫూర్తి ప్రజ్వరిల్లింది.. మువ్వన్నెల కీర్తి రెపరెపలాడింది..భారీ జాతీయ జెండాల ప్రదర్శన ఆసాంతం అబ్బురపరిచింది.. భారత్ మాతాకీజై నినాదం దేశభక్తిని మరింత పెంచింది. భారత స్వతంత్ర వజ్రోత్సవాలు నగరంలో రోజుకోరీతిలో సాగుతున్నాయి. శనివారం ఫ్రీడం ర్యాలీలు కనులపండువగా జరిగాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి ట్యాంక్బండ్ వివేకానంద విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు, మంత్రులు మహమూద్అలీ, తలసానితోపాటు బల్దియా, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందలాది మంది జాతీయ జెండాలు చేతబూని నినాదాలు చేశారు. ఐటీసీ కోహినూర్ తీగల వంతెన వద్ద 400 మంది రైడర్లతో నిర్వహించిన ఫ్రీడం ర్యాలీని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. ఉత్సవాల నేపథ్యంలో ట్యాంక్బండ్పై అలనాటి ఆర్టీసీ బస్సుల పరేడ్ అప్పటి రవాణా అనుభవాలను గుర్తుకు తెచ్చింది. వివిధ రకాల బస్సులను ర్యాలీలో ఉంచారు. కంటోన్మెంట్లో జరిగిన మెగా శిబిరంలో 200 మంది రక్తదానం చేశారు.
ట్యాంక్బండ్పై అలనాటి ఆర్టీసీ బస్సులతో ర్యాలీ నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు
సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందించడంతో పాటు స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించే ముఖ్యోద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వజ్రోత్సవ వేడుకలకు భారీ ఎత్తున స్పందన వస్తుందని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా శనివారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రధాన కార్యాలయం నుంచి ట్యాంక్బండ్ వివేకానంద విగ్రహం వరకు నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ ఘనంగా జరిగింది. జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది, ఎంటమాలజీ, డీఆర్ఎఫ్ బృందాలు, ఉన్నతాధికారులు, అధికారులు సిబ్బందితో పాటు స్వయం సహాయక బృందాలు, ఎన్.ఎస్.ఎస్., ఎన్సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్ విద్యార్థులు, పోలీసు సిబ్బంది… ఇలా వేలాది మంది జాతీయ జెండా పట్టుకొని భారతమాతకు జై అంటూ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ… స్వతంత్ర భారతంలో ఆనాటి పోరాట స్ఫూర్తి, త్యాగాలను స్మరించుకోవాలనే వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ ర్యాలీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, వీటికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ… స్వాతంత్య్ర స్ఫూర్తిని భావితరాల్లో నింపేలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. మేయర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వజ్రోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఫ్రీడమ్ ర్యాలీలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, అదనపు డీజీ జితేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి, శాసనమండలి సభ్యులు వాణీదేవి, ఎం.ఎస్.ప్రభాకర్రావు, యెగ్గె మల్లేశం, శాసనసభ్యులు దానం నాగేందర్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్ అందరూ కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రముఖులంతా గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. త్రివర్ణ బెలూన్లను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
కాన్వాయ్ ఆపి.. తిరంగా ర్యాలీలో..
పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
బంజారాహిల్స్, ఆగస్టు 13: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 1లో ఓ ప్రైవేటు కళాశాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ ఆపి, విద్యార్థుల చేతిలో నుంచి జాతీయ జెండాను తీసుకుని ర్యాలీలో కొంతదూరం పాల్గొన్నారు. మంత్రి ర్యాలీలో పాల్గొనడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
భారీ జెండాతో మానవహారం
అల్లాపూర్, ఆగస్టు 13: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మూసాపేట పంచశీల స్కూల్ ఆధ్వర్యంలో శనివారం 175 మీటర్ల భారీ జెండాతో మానవహారంగా ఏర్పడి ర్యాలీ నిర్వహించారు. మూసాపేట చౌరస్తా నుంచి సర్కిల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్, పంచశీల స్కూల్ అధినేత శ్రీనివాసులు, నిఖిల్, రాజు, కిరణ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
దళిత బంధు వాహనాలతో ర్యాలీ
మేడ్చల్, ఆగస్టు13(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భారత స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. మేడ్చల్లోని ఘట్కేసర్లో దళితబంధు పథకంలో మంజూరైన వాహనాల ర్యాలీని జెండా ఊపి మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు.
కవాడిగూడ, ఆగస్టు 13: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా టీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సులతో పరేడ్ నిర్వహించారు. ఆర్టీసీ మొదటి బస్సు 1932 సంవత్సరంలోని ప్రారంభపు ‘అల్ బియన్’ బస్సును పరేడ్లో తిప్పారు. ఆ బస్సును లండన్ నుంచి ప్రత్యేకంగా నిజాం హయాంలో తీసుకువచ్చారు. ఆ విధంగా ఆర్టీసీ బస్సుల చరిత్ర ప్రారంభమైందని ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ట్యాంక్బండ్పై వివేకానంద విగ్రహం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ 1940లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేసిన 98 ఏండ్ల టీఎల్ నరసింహన్ కలిసి జెండాను ఊపి ప్రారంభించారు. ఆర్టీసీలోని వివిధ రకాల బస్సులను ఈ పరేడ్లో తిప్పారు. బస్సులను జాతీయ జెండాల ఫ్లెక్సీలతో పాటు, స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలతో అద్భుతంగా తీర్చి దిద్దారు. ఆర్టీసీ ఉద్యోగులు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యంగా నల్లగొండ పోలీస్ బృందం బ్యాండ్ ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం టీఎల్ నరసింహన్ను ఎండీ సజ్జనార్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవీందర్, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు, హెచ్వోడీలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
సికింద్రాబాద్, ఆగస్టు 13: ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆంధ్ర సబేరియా (టాసా) ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రెండు రోజుల పాటు జరుగనున్న మెగా ఈవెంట్ వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టాసా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసి), మేజర్ జనరల్ రంజిత్సింగ్ మన్రాల్ ఈవెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాహసోపేత విన్యాసాలు, ఆయుధాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకుగాను నగర పౌరులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఆయుధాల ప్రదర్శన
మెగా ఈవెంట్లో భాగంగా టాసా పరేడ్ మైదానంలో ప్రదర్శించిన టీ-72 యుద్ధ నౌకలు, యుద్ధాల్లో వినియోగించే వివిధ ఆయుధాలు, ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్, కమ్యూనికేషన్ వాహనాలు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్, 81ఎంఎం మోర్టార్, రాకెట్ లాంచర్లు తదితరాల పనితీరును అడిగి తెలుసుకునేందుకు పౌరులు ఉత్సుకత చూపించారు. వాటివద్ద కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. 16బీహార్, 13వ డోగ్రా, 22వ మీడియం, 41వ డోగ్రా తదితర రెజిమెంట్లు ప్రదర్శించిన ఆర్ట్ గ్యాలెరీల ద్వారా వీర జవాన్ల విజయ గాథలు, సిఫాయిలు ధరించే దుస్తులు, వివిధ యుద్ధాల్లో ఆయా రెజిమెంట్లు సాధించిన విజయాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించడంపై పలువురు సందర్శకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.