కంటోన్మెంట్ : కంటోన్మెంట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత (Niveditha ) కే సర్వేలో ఫలితాలన్నీ అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి (Ravula Sridhar Reddy)స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు కనీసం దరిదాపుల్లోనూ కాంగ్రెస్, బీజేపీలు లేవని తేల్చిచెప్పారు. బోయిన్పల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Rajashekar reddy) తో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పెద్ద ఎత్తున పలు వార్డుల్లో డబ్బులను పంపిణీ చేస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులను పంపిణీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. వెన్నెల గద్దర్కు టికెట్ ఇవ్వకుండా ఒక ఆడబిడ్డను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఓటేస్తే కష్టాలు తప్పవని హితవు పలికారు. 30 ఏండ్లు కంటోన్మెంట్కు సేవ చేసిన సాయన్న కుమార్తె నివేదితను గెలిపించుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానంతో పాటు మల్కాజిగిరి ఎంపీ స్థానంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోక్నాథ్ తదితరులు పాల్గొన్నారు.