ఖైరతాబాద్ : లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉంటున్న క్రైస్తవులు బీఆర్ఎస్ (BRS) కే అండగా నిలుస్తారని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ (Christian Joint Action ) కమిటీ అధ్యక్షులు ఎం. సాల్మన్ రాజు అన్నారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాప్టిస్ట్ చర్చెస్ అసోసియేషన్ అధ్యక్షులు డేవిడ్ శాంతి రాజ్తో కలిసి ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా క్రైస్తవుల (Christians) కు సరైన ప్రాధాన్యత కల్పించలేదన్నారు. క్రైస్తవులకు న్యాయం జరుగకపోగా , దాడులు, దౌర్జన్యాలు మాత్రం జరిగాయన్నారు.
2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ (KCR) నాయకత్వంలో క్రైస్తవులకు గుర్తింపు దక్కిందని పేర్కొన్నారు. గతంలో క్రిస్మస్, బాక్సింగ్(Boxing day) డేలకు ఆప్షనల్ హాలీడేలు మాత్రమే ఇచ్చే వారని, బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించారని వెల్లడించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలు నిర్వహించారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కేవలం నాలుగు నెలల కాలంలో చర్చిలపై 24 దాడులు జరిగాయన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణను అక్కున చేర్చుకొని దళితులందరినీ పక్కన పెట్టారన్నారు. గతంలో చర్చిలు నిర్మించుకోవాలంటే ఆయా గ్రామపంచాయతీలు, కలెక్టర్ల వద్ద ఎన్వోసీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉండేదని, కాని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి షరతులు లేకుండానే చర్చిలు నిర్మించుకునేలా జీవో జారీ చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మైనార్టీలకే ప్రమాదమని, బీఆర్ఎస్కు ఓటు వేస్తే అన్ని వర్గాలు, మతాలకు సమ న్యాయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ జేఏసీ నాయకులు జ్యూడ్ రవి, అండ్రూ జేవియర్, డానియల్, లీయో, శ్యామ్సన్, ప్రకాశ్, రవికుమార్, సూరిబాబు, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.