హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : దేశ స్వతంత్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంతోపాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో స్వతంత్ర వైఖరిని కొనసాగించాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. హిమాయత్నగర్లోని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఇస్కఫ్) రాష్ట్ర కార్యాలయంలో జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ‘ఇరాన్పై అమెరికా యుద్ధం-భారత్పై ప్రభావం’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. మన దేశ విదేశాంగ విధానంలో కీలకంగా ఉన్న అలీన విధానాన్ని పునరుద్ధించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు.
అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నదని, భారత విదేశాంగ విధానంలో యూఎస్కు అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆరోపించారు. భారత విద్యార్థుల చేతులకు సంకెళ్లు వేసి దేశానికి పంపిన వైఖరిని ప్రశ్నించకపోవడం ఆందోళనకరమని మండిపడ్డారు. ప్రొ. కే నాగేశ్వర్ మాట్లాడుతూ.. పశ్చిమాసియాలో మారుతున్న రాజకీయ, భద్రతా పరిణామాల నేపథ్యంలో మన దేశం జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేలా సమతుల్యమైన, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించాలని సూచించారు.