Medicine | వయసు పెరిగేకొద్దీ రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఒకేసారి అనేక మందులు వాడాల్సి వస్తుంటుంది. అయితే ఇలా పలు మందులను కలిపి తీసుకునే సమయంలో కొన్ని ఔషధాల మధ్య పరస్పర ప్రభావాలు ఏర్పడి తీవ్రమైన దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కాలేయం, మూత్రపిండాల పనితీరు మందగించడం వల్ల శరీరంలోకి చేరిన మందులు బయటకు వెళ్లేందుకు ఎక్కువ సమయం పడుతుంది. దీంతో ఒకప్పుడు సురక్షితంగా ఉన్న మోతాదు కూడా వృద్ధాప్యంలో దుష్ప్రభావాలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ తీసుకునే అన్ని మందులు, సప్లిమెంట్లు, వైద్యుల సూచన లేకుండా వాడే మందుల వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం అవసరం.
రక్తాన్ని పలుచబరిచే మందులతోపాటు ఇబుప్రోఫెన్, న్యాప్రోక్సెన్ వంటి నొప్పి నివారణ మందులు తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో రక్తస్రావం, కడుపులో పుండ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అలాగే రక్తపోటు కోసం ఉపయోగించే ఏసీఈ ఇన్హిబిటర్లతోపాటు పొటాషియం సప్లిమెంట్లు లేదా పొటాషియంను నిల్వ చేసే కొన్ని మూత్రవిసర్జక మందులు తీసుకుంటే రక్తంలో పొటాషియం స్థాయిలు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది గుండె స్పందనలో అసాధారణ మార్పులకు దారితీస్తుంది. కాబట్టి పొటాషియం సప్లిమెంట్లు లేదా ప్రత్యేక ఉప్పు వంటి వాటిని వైద్యుల సలహా లేకుండా ప్రారంభించకూడదు.
ఆందోళన, నిద్ర కోసం ఉపయోగించే కొన్ని మందులను ఆక్సికోడోన్, ట్రామడాల్ వంటి బలమైన నొప్పి నివారణ మందులతో కలిపి తీసుకోవడం కూడా ప్రమాదకరం. ఈ మందుల ప్రభావం కలిసి మెదడు, నాడీ వ్యవస్థ పనితీరు మరింత మందగించడంతో తీవ్రమైన మగత, గందరగోళం, పడిపోవడం, శ్వాస మందగించడం వంటి సమస్యలు వస్తాయి. మరోవైపు కాల్షియం సప్లిమెంట్లు లేదా కొన్ని అంటాసిడ్లను థైరాయిడ్ మందులతో కలిపి తీసుకుంటే థైరాయిడ్ మందు శరీరంలోకి సరిగా శోషణ అవ్వదు. అందువల్ల ఈ మందుల మధ్య కనీసం నాలుగు గంటల విరామం ఉండేలా చూసుకోవాలి. థైరాయిడ్ మందును సాధారణంగా ఉదయం ఖాళీ కడుపుతో నీటితో తీసుకోవాలని సూచిస్తారు.
కొలెస్ట్రాల్ తగ్గించే కొన్ని మందులను ఎరిత్రోమైసిన్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్ లేదా కెటోకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ మందులతో కలిపి తీసుకున్నప్పుడు మందుల స్థాయిలు శరీరంలో అధికంగా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దీంతో తీవ్రమైన కండరాల నష్టం, మూత్రపిండాలపై ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వృద్ధుల్లో మందుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, ఒక వైద్యుడు సూచించిన మందుతో పాటు ఇతర వైద్యుల మందులు, ఓవర్ది కౌంటర్ మందులు, సప్లిమెంట్లు తీసుకుంటున్నట్లయితే వాటి వివరాలను తప్పనిసరిగా తెలియజేయాలి. ఏదైనా అసాధారణ దుష్ప్రభావం కనిపిస్తే స్వయంగా మందు ఆపకుండా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్సను సమీక్షించుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.