హైదరాబాద్ : కృష్ణా నదిపై ఉన్న జలాశయాలకు భారీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రియదర్శిని డ్యామ్కు 4.75లక్షలు ఇన్ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 4,77,745 క్యూసెక్కులుగా ఉన్నది. 47 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 9.657 టీఎంసీలకు గాను.. ప్రస్తుతం 5.973 టీఎంసీల నిల్వ ఉన్నది. శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో 5,04,086 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తివేత సాగర్కు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఔట్ ఫ్లో 5,30,175 క్యూసెక్కులుగా ఉన్నది.
డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను.. ప్రస్తుతం నీటిమట్టం 883.50 అడుగులున్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 207.41 టీఎంసీలు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ జలాశయానికి ఇన్ఫ్లో 4,11526 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 36,572 క్యూసెక్కులుగా ఉన్నది. గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 579.20 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 312.0450 టీఎంసీలకు.. ప్రస్తుత నీటి నిల్వ 280 టీఎంసీలకు నిల్వ ఉన్నది.