బెంగళూరు : కేరళ, మహారాష్ట్రల్లో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆ రెండు రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. టీకాలతో సంబంధం లేకుండా 72 గంటల్లోపు తీసుకున్న రిపోర్ట్ను సమర్పించాలని స్పష్టం చేసింది. విమానాలు, బస్సులు, రైళ్లు, వ్యక్తిగత వాహనాల ద్వారా వచ్చే ప్రయాణికులందరికీ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరని చెప్పింది. కేరళ, మహారాష్ట్రల్లో ప్రారంభమయ్యే అన్ని విమానాలకు వర్తిస్తుందని, 72గంటలకు మించకుండా ఉన్న ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్న ప్రయాణికులకే విమానయాన సంస్థలు బోర్డింగ్ పాస్లు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
దక్షిణ కన్నడ, కొడగు, మైసూర్, బెళగావి, విజయపుర, కాలబురిగి, బీదర్ డిప్యూటీ కమిషనర్లు కర్ణాటకలో ప్రవేశించే వాహనాలను సరిహద్దు చెక్పోస్టుల వద్ద తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉండగా.. కర్ణాటకలో కొత్తగా శనివారం 1,987 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 450 కేసులు బెంగళూరు అర్బన్లోనే ఉన్నాయి. కేరళ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో కేసుల సంఖ్య కాస్త పెరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.