సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): నగరంలో బస్సులు సకాలంలో రాకపోవడంతో వర్షం కురిసినప్పుడు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సి వస్తున్నదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్య పెంచాలంటూ ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. వచ్చిన బస్సులు కూడా రద్దీగా ఉంటున్నాయి. కొన్ని చోట్ల బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వస్తున్నది. మరోవైపు నగర శివార్ల పూర్తిస్థాయిలో బస్సులు నడపడం లేదు.
నగర శివార్లకు రాత్రి 9 దాటిందంటే ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. హుషారుపల్లి, ఆదిబట్ల, దుండిగల్, మోకీల, శంకర్పల్లి, కొల్లూర్ నియోపాలిస్ సమీపంలోని ప్రాంతాలకు సమయపాలన లేని అరకొర బస్సులు కాకుండా సరిపడా నడపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.