భువనేశ్వర్ : ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు నైట్కర్ఫ్యూను పొడగించింది. ఆదివారం నుంచి వచ్చే నెల వరకు రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు నైట్కర్ఫ్యూ అమలులో ఉండనుంది. అయితే కటక్, పూరి, భువనేశ్వర్లో వారాంతపు లాక్డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కరోనా మహమ్మారి కేసులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నైట్కర్ఫ్యూ పొడగించినా.. సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షల నుంచి సడలింపులు ప్రకటించింది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలో షాపింగ్ మాల్స్, పార్కులు, సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పూరిలోని జగన్నాథ దేవాలయం, భువనేశ్వర్లోని లింగరాజ్ ఆలయం మినహా మతప్రదేశాలను తెరిచేందుకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి సూచించింది.
అన్ని వారాంతపు, నెలవారీ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, పార్కులు, ఆదివారం నుంచి తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో 50శాతం మంది సిబ్బందితో పని చేసేందుకు అనుమతి ఇచ్చాయి. బార్లు, థియేటర్లు 50శాతం సీటింగ్ సామర్థ్యంతో కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ నడిపేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, కటక్, భువనేశ్వర్, పూరీలోని మాల్స్, రెస్టారెంట్లు, బార్లు, సినిమా థియేటర్లలో రెండు డోసుల టీకా వేసుకున్న వారినే అనుమతించనున్నారు. 25 మందితో వివాహాలు, ఇతర వేడుకలకు.. అంత్యక్రియల్లో 20 మంది పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. కోచింగ్ సెంటర్లు, మ్యూజియాలు, పర్యాటక ప్రదేశాలు, జంతు ప్రదర్శనశాలలు, పురావస్తుశాఖ కట్టడాలను తిరిగి తెరువనున్నారు.