వాషింగ్టన్: కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న వేళ.. అమెరికాను ‘హవానా సిండ్రోమ్’ కలవరపెడుతున్నది. అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బందిపై మైక్రోవేవ్, రేడియో వేవ్ దాడులు జరుగుతున్నట్లు అక్కడి శాస్త్రవేత్తలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇటువంటి దాడులు ఊపందుకున్నాయి. ఇప్పటివరకు ఈ దాడుల వెనుక ఎవరున్నారో శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు కనుగొనలేకపోయారు.
ప్రస్తుతం జో బైడెన్ ప్రభుత్వం ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టాలని, అలాగే బాధిత అధికారులకు మెరుగైన వైద్య సంరక్షణను అందించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. ఇటువంటి దాడుల మొదటి కేసు 2016 లో క్యూబాలోని యూఎస్ ఎంబసీలో బయటపడింది. అందుకే దీనికి ‘హవానా సిండ్రోమ్’ అని పేరు పెట్టారు.
ఈ రహస్య దాడులకు సంబంధించి ఇప్పటివరకు 130 కేసులు నమోదయ్యాయని అమెరికన్ అధికారి ఒకరు తెలిపారు. గత సంవత్సరంలోనే డజన్ల కొద్దీ కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. ఈ దాడులపై జాతీయ భద్రతా మండలి కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం.
ఈ దాడికి గురైన వ్యక్తులు తలనొప్పి, మైకంలో ఉన్నట్లు వైద్యులకు చెప్పారు. కొందరు దాడికి ముందు పెద్ద ధ్వని విన్నట్లు కూడా తెలిపారు. వాషింగ్టన్లో ఇలాంటి సంఘటనలను కనీసం రెండింటిని గుర్తించారు. ఈ దాడుల్లో ఒకటి గత ఏడాది నవంబర్లో వైట్హౌస్ సమీపంలో జరిగింది. దాడికి గురైన అధికారి దాడి తర్వాత మైకంలో ఉన్నట్లు చెప్పినట్లు తెలిసింది.
బాధితుల తరఫున వాదించిన వాషింగ్టన్ న్యాయవాది మార్క్ జైద్.. ప్రభుత్వం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించలేదని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వానికి ఇప్పటికే అవగాహన ఉన్నదని, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి వచ్చిన పత్రాలను ఉటంకిస్తూ, 1990 లో శత్రుదేశం జరిపిన దాడి గురించి ప్రభుత్వానికి సమాచారం ఉన్నదని తెలిపారు.
ట్రంప్ ప్రభుత్వం చివరి రోజుల్లో ఈ దాడులపై దర్యాప్తు చేయడానికి యాక్టింగ్ రక్షణ మంత్రి క్రిస్ మిల్లెర్ పెంటగాన్ అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారు. అటువంటి దాడికి గురైన ఒక సైనికుడిని కలిసిన తర్వాత మిల్లెర్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.
కరోనా నియంత్రణకు కాక్టైల్ ఔషధాన్ని తీసుకొచ్చిన రోచె-సిప్లా
సహజంగా బరువు తగ్గేందుకు ఈ పండ్లు తినండి..!
క్వారంటైన్లో పాక్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు
అజ్మీర్లో పెద్ద ఎత్తున నిషేధిత మందులు పట్టివేత
కొవిడ్ అంటే అంటువ్యాధే కాదు.. ఓ సంస్థ పేరు కూడా..!
తొలిసారిగా చిన్ని గుండెను సృష్టించిన శాస్త్రవేత్తలు
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతులు
డబ్ల్యూటీసీ పేలుడు కేసులో నలుగురికి 240 ఏండ్ల జైలుశిక్ష.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..