సూరత్: కరోనా రెండో వేవ్.. భారతీయుల్లో ఆందోళన పెంచేసింది.. కేంద్రం జాతీయ స్థాయిలో లాక్డౌన్ లేదని ప్రకటించినా.. రాష్ట్రాలు తీవ్రత ఉన్న ప్రాంతాల్లో స్థానికంగా లాక్డౌన్లు, కర్ఫ్యూలు, ఇతర ఆంక్షలు విధిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో దేశంలోనే అత్యంత విలువైన వజ్రాల పరిశ్రమపైనా ప్రభావం కనిపిస్తున్నది.
గుజరాత్లోని సూరత్ పట్టణం వజ్రాల తయారీ, వాటికి డిజైన్లకు పెట్టింది పేరు.. రమారమీ సూరత్ వజ్రాల వ్యాపారం టర్నోవర్ రూ.1.45 లక్షల కోట్లు.
ఈ పరిశ్రమపై కనీసం ఐదు లక్షల మంది కార్మికులు, వారి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. వీరికి సూరత్లోని చిన్న, పెద్ద డైమండ్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్లు 3000 వరకు ఉపాధి కల్పిస్తున్నాయి.
కరోనా రెండో వేవ్ ప్రభావం తమ ఇండస్ట్రీపై లేదని సూరత్ డైమండ్ అసోసియేషన్ ప్రకటిస్తున్నా.. కొవిడ్-19 నీలినీడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు.
ఈ మూడు రాష్ట్రాలతోపాటు గుజరాత్లోని సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ రీజియన్ల నుంచి భారీగానే కార్మికులు సూరత్కు వచ్చి పని చేస్తూ తమ కుటుంబాల జీవనం సాగిస్తున్నారు.
మెజారిటీ వలస కార్మికులు గుజరాత్లోని ఇతర ప్రాంతాల వారేనని సూరత్ డైమండ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాను వెకారియా చెబుతున్నారు.
ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు.. మొత్తం వజ్రాల తయారీ కార్మికుల్లో 10 శాతమేనని నాను వెకారియా చెప్పారు.
ఈ ఐదు లక్షల మందిలో కేవలం ఐదు శాతం మంది మాత్రమే సొంతూళ్లకు వెళ్లారన్నారు. వారిలో ఇతర రాష్ట్రాలు, గుజరాత్లోని ఇతర రీజియన్ల వారూ ఉన్నారు.
పెండ్లిండ్లు, ఇతర సామాజిక వేడుకల కోసం కొందరు వెళితే, మరికొంత మంది భయంతో వెళ్లారని వెకారియా వ్యాఖ్యానించారు. ఇంకొందరు అనారోగ్యంతో బాధపడుతున్న తమ తల్లిదండ్రులు, బంధువుల బాగోగులు చూసుకునేందుకు వెళ్లారన్నారు. వారి పనులు పూర్తి కాగానే వచ్చేస్తారన్నారు.
మెజారిటీ డైమండ్ పాలిషింగ్ యూనిట్లు యధావిధిగా పని చేస్తున్నాయి. తక్కువ మంది వలస కార్మికులు మాత్రమే వెళ్లిపోయారు. పరిస్థితులు మెరుగు పడిన తర్వాత తిరిగి వస్తారని వెకారియా వెల్లడించారు.
కానీ, చాలా మంది కార్మికులు మాత్రం లాక్డౌన్ విధిస్తారన్న భయంతోనే సొంతూళ్లకు వెళ్తున్నామని చెప్పడం గమనార్హం. గురువారం రికార్డు స్థాయిలో గుజరాత్లో 8,152 మందికి కరోనా సోకింది.