హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రంగంలో 7,231 ఉద్యోగాలు తగ్గినట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఐటీ ఉద్యోగాల్లో పురోగతి, గత 25 నెలల్లో రాష్ర్టానికి వచ్చిన ఎగుమతులు, ఉపాధి వివరాలపై ఎమ్మెల్సీ తాతా మధు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీధర్బాబు బదులిచ్చారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఐటీ పార్కులు అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. టాస్క్ ద్వారా నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల(జీసీసీ)ను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. స్టార్టప్ ఎకో సిస్టమ్కు మద్దతు, ఐసీటీ, ఇమేజ్ పాలసీలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించారు. 2023-24లో రూ.2,68,233 కోట్లు, 2024-25లో రూ.3,12,941 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగినట్టు పేర్కొన్నారు. 2023-24లో 9,46,285 మంది ఐటీ రంగంలో ఉపాధి పొందగా.. 2024-25కి ఈ సంఖ్య 9,39,054కి తగ్గిందని తెలిపారు.
‘టీజీ ఐపాస్’ ద్వారా 3,903 కొత్త పరిశ్రమలు
గత రెండేండ్లలో రాష్ట్రంలో టీజీ ఐపాస్ ద్వారా 3,903 పరిశ్రమలకు అవసరమైన క్లియరెన్సులు ఇచ్చినట్టు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. ఈ మేరకు శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఈ నూతన పరిశ్రమల ద్వారా 1,05,960 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్టు తెలిపారు.