దొంగిలించిన చీరే దొంగలను పట్టించింది! మూడేళ్ల క్రితం జరిగిన ఇంటి దొంగతనం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. దొంగతనం చేసిన చీరను ఓ మహిళ ఫంక్షన్కు కట్టుకుని రావడంతో.. దాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దంపతులను అదుపులోకి తీసుకుని విచారించగా.. మూడేళ్ల క్రితం తామే దొంగతనం చేసినట్లు అంగీకరించారు.
బండ్లగూడ జాగీర్లోని వినాయకనగర్ ప్రాంతంలో యాదయ్య తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న యాదయ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. సెప్టెంబర్ 19న తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఇంట్లోని రూ.2.50 లక్షల నగదు, 9 తులాల బంగారం, పలు చీరలు కనిపించకపోవడంతో యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేసు నమోదైంది. ఈ ఘటన జరిగి మూడేళ్లు గడిచిపోయాయి. దొంగలు ఎవరో ఎంతకీ తెలియలేదు.
అయితే, ఇటీవల ఓ ఫంక్షన్కు వెళ్లిన యాదయ్య భార్యకు ఊహించని పరిచయం ఎదురైంది. తమ ఇంటి వెనుక నివసించే స్వప్న (29) అనే మహిళ కట్టుకున్న చీరను చూసిన ఆమె ఒక్కసారిగా గుర్తుపట్టారు.“ఇది మా ఇంట్లో దొంగిలించిన చీరే” అని నిర్ధారించుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు స్వప్నతో పాటు ఆమె భర్త రాములు (35)ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తొలుత ఆ చీర తనదేనంటూ స్వప్న బుకాయించినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో చివరకు అసలు విషయం బయటపడింది.
2023లో యాదయ్య ఇంట్లో జరిగిన దొంగతనానికి తామే పాల్పడ్డామని స్వప్న, రాములు దంపతులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో స్వప్న, రాములుపై దొంగతనం కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మూడేళ్లుగా పరిష్కారం కాని కేసులో.. చివరకు ఓ చీరే కీలక ఆధారంగా మారి దొంగలను పోలీసులకు పట్టించింది.