వాషింగ్టన్ : కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించేందుకు ఏడాదిలో మూడో డోసు అవసరమని అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా పేర్కొన్నారు. గురువారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ఫైజర్ టీకా తీసుకున్న వారికి ఏడాదిలో మూడో మోతాదు అవసరం అవుతుందని చెప్పారు. ప్రస్తుతం మహమ్మారికి వ్యతిరేకంగా టీకాలు వేయడం అవసరమన్నారు. ‘ఈ క్రమం ఎలా ఉంటుందో మనం చూడాలని, బహుశా ఆరు నెలల నుంచి 12 నెలల మధ్య మూడో మోతాదు అవసరం అవుతుంది’.. వార్షిక పునః టీకాలు ఉంటాయన్నారు. కానీ, ఇవన్నీ ధ్రువీకరించాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం వైరస్ బారినపడే వ్యక్తుల సమూహాన్ని అణచివేయడం చాలాముఖ్యమన్నారు.
ప్రస్తుతం ఉన్న అందుబాటులో ఉన్న టీకాలు ఎంతకాలం వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయో పరిశోధకులకు తెలియడం లేదు. ‘ఫైజర్’ ఈ నెల ప్రారంభంలో ఓ అధ్యయనం ప్రచురించగా.. ఇందులో వైరస్ నుంచి రక్షించడంలో టీకా 91శాతం ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తెలిపింది. రెండో మోతాదు తీసుకున్న తర్వాత ఆరు నెలల వరకు తీవ్రమైన కేసులకు వ్యతిరేకంగా 95 శాతం కంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉందని పేర్కొంది. అయితే, ఆరు నెలల తర్వాత రక్షణ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు మరిన్ని వివరాలు అవసరమని పరిశోధకులు పేర్కొంటున్నారు. జర్మన్ సంస్థ ఎన్ బయోటెక్ భాగస్వామ్యంతో ఫైజర్ కొవిడ్ వ్యాక్సిన్ను తయారు చేసింది. ఈ టీకా యూరప్, అమెరికాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఔషధ దిగ్గజం ఫిబ్రవరిలో తన మూడో టీకా మోతాదును పరీక్షిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.