న్యూఢిల్లీ : దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్లో మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓ వైపు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న కేసులతో దవాఖానల్లో బెడ్లు సరిపోవడం లేదు. మరో వైపు భారీగా పెరుగుతున్న మరణాలతో శ్మశానాల్లోనూ స్థలం దొరకడం లేదు. వైరస్ కట్టడికి పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. నిన్న రెండు లక్షలకుపైగా కొవిడ్ కేసులు నమోదవగా.. తాజాగా గడిచిన 24 గంటల్లో మరోసారి రికార్డు స్థాయిలో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
అలాగే 24 గంటల్లో 1,185 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు పెరిగింది. కొత్తగా 1,18,302 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,25,47,866 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 1,74,308 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు టీకా డ్రైవ్లో 11,72,23,509 డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 14.73లక్షల కొవిడ్ టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 26.34 కోట్ల నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది.