Google : ఇజ్రాయెల్తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన 28 మంది ఉద్యోగులను టెక్ దిగ్గజం గూగుల్ తొలగించింది. ఈ కాంట్రాక్ట్కు వ్యతిరేకంగా ఈ ఉద్యోగులు ఇటీవల రెండు గూగుల్ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు. అంతకుముందు మంగళవారం గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ కార్యాలయాన్ని 8 గంటల పాటు ముట్టడించి అక్కడి నుంచి కదిలేందుకు నిరాకరించిన కొందరు ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
ఉద్యోగుల అరెస్ట్ అనంతరం నిరసనకారులపై గూగుల్ వేటు వేసిందనే వార్తలు వెలువడ్డాయి. ఇలాంటి ప్రవర్తనకు గూగుల్లో చోటులేదని, వీటిని ఉపేక్షించే ప్రసక్తి లేదని కంపెనీ జారీ చేసిన ఇంటర్నల్ మెమో వెల్లడించిందని వెర్జ్ తెలిపింది.
ఉద్యోగులు ఇలా ప్రవర్తిస్తే సహించబోమని, నిరసనలకు దిగితే ఉపేక్షించేందిలేదని గూగుల్ గ్లోబల్ సెక్యూరిటీ హెడ్ క్రిస్ రాకో ఉద్యోగులను హెచ్చరించారని వెర్జ్ రిపోర్ట్ పేర్కొంది. న్యూయార్క్, సన్నీవేల్లో గూగుల్ కార్యాలయాల వద్ద కంపెనీ ఉద్యోగులు ధర్నా చేపట్టిన తీరును మెమోలో ప్రస్తావించింది. నిరసనకారులు కార్యాలయ ప్రాంగణాలను స్వాధీనం చేసుకున్నారని, ఇతర గూగుల్ ఉద్యోగుల పనిని భౌతికంగా అడ్డుకున్నారని మెమోలో పేర్కొంది.
Read More :