Road accident : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హర్దోయ్-ఉన్నవ్ రహదారిపై సఫీపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని జమల్దిపూర్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన11 మందిని కాన్పూర్ ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని ఉన్నవ్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో చిన్నచిన్న గాయాలు అయిన వారికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ పారిపోయాడని చెప్పారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు.