అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు పింఛన్దారులకు శుభవార్త చెప్పారు. మే 1వ తేదీనే బ్యాంకు ఖాతాలో పింఛన్ డబ్బు జమ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆదివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) లో మాట్లాడారు . పింఛన్లను బ్యాంకు ఖాతాల్లో వేయాలని ఆదేశించారు.
బ్యాంక్ ఖాతాలు (Bank Account) లేని వారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వారికీ ఇంటి వద్దే పింఛన్లు (Pensions) పంపిణీ చేయాలని సూచించారు. మే 1 నుంచి 5లోగా ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని ఆదేశించడంతో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత వాలంటీర్ల (Volunteers) వ్యవస్థ ద్వారా కాకుండా పంచాయతీ కార్యాలయం వద్ద గత నెల పింఛన్లు పంపిణీ చేశారు. దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్య బాధితులు అనేక ఇబ్బందులు పడ్డారు. కొందరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తూ మృతి చెందడంతో రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగారు. నేరుగా వాలంటీర్ల ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దీంతో మే ఒకటిన పింఛన్ల పంపిణీకి ఆదేశాలు జారీ చేశారు.